Allu Arjun: సంథ్య ధియేటర్ కేసులో బన్నీకి ఎదురుదెబ్బ.. పుష్పాను నేరుగా హాజరు కావాలన్న కోర్టు

Allu Arjun: సంథ్య ధియేటర్ కేసులో బన్నీకి ఎదురుదెబ్బ.. పుష్పాను నేరుగా హాజరు కావాలన్న కోర్టు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నుంచి భారీ షాక్ తగిలింది.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'పుష్ప-2' ప్రీమియర్ షో తొక్కిసలాట కేసులో బన్నీకి కోర్టు సమన్లు జారీ చేసింది.  సోమవారం ఆయన్ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. బన్నీకి కోర్టు సమన్లు ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. 

కోర్టుకు రావాల్సిందే..

అయితే  సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా కోర్టుకు అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. వీడియో ద్వారా విచారణకు హాజరవుతానని విన్నమించారు. కానీ కోర్టు వారి పిటిషన్ ను తిరస్కరించింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది. నిందితుల వ్యక్తగత హాజరు తరువాత ఈ కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించనుంది. దీంతో బన్నీ వ్యక్తిగత హాజరుపై ఉత్కంత నెలకొంది.

అసలేం జరిగింది?

2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎగబడటంతో అక్కడ పెను తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి  ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు తర్వాత కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ALSO READ : ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకు బంపర్ ఆఫర్..

ఏ11 గా ఐకాన్ స్టార్!

పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో హీరో అల్లు అర్జున్‌ను A11 (11వ నిందితుడు) గా చేర్చడం సంచలనంగా మారింది. బన్నీతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న మరో 19 మంది నిందితులకు కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

సోమవారం ఏం జరగబోతోంది?

ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్‌పై రగ్గడ్ లుక్‌లో, తగ్గేదేలే అంటూ అలరించే అల్లు అర్జున్.. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం నాడు బన్నీ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరవుతారా? లేక ఆయన తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేస్తారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఏదేమైనా.. 'పుష్ప' క్రేజ్ తెచ్చిన ఈ ఊహించని లీగల్ ట్రబుల్ బన్నీ టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి.