బీఆర్ఎస్​కు వలసల టెన్షన్ ​!

బీఆర్ఎస్​కు వలసల టెన్షన్ ​!
  •     ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్​లోకి పెరుగుతున్న చేరికలు 
  •     పార్లమెంట్ పోరు తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై ఎఫెక్ట్ 
  •     అయోమయంలో గులాబీ నేతలు 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్​కు వలసల టెన్షన్​పట్టుకుంది. పన్నెండు నియోజకవర్గాల్లో దాదాపు బీఆర్ఎస్ ఖాళీ అయ్యింది. ముఖ్యంగా మున్సిపాలిటీ పాలకవర్గాలన్నీ కాంగ్రెస్​ ఖాతాలో చేరిపోయాయి. మండల, జిల్లా స్థాయిలో లోకల్​బాడీ ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్​లో చేరడంతో బీఆర్ఎస్​ కేడర్​అయోమయంలో పడింది. ఈ ఎఫెక్ట్​ పార్లమెంట్​ఎన్నికలపైనే కాకుండా వచ్చే లోకల్​బాడీ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపుతుందేమోనని గులాబీ నేతలు ఆందోళన చెందుతుందుతున్నారు.

ఒకవైపు గ్రామ, మండల, పట్టణ స్థాయిలో కాంగ్రెస్​మరింత బలపడుతుండగా, మరోవైపు బీఆర్ఎస్​లో చేరినవారంతా తిరిగి సొంత గూటికి వస్తుండడంతో కొత్త చిక్కులు తెచ్చిపెడ్తోంది. పలుచోట్ల చేరికలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్​ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాల ఓటర్లను ప్రభావితం చేయగలిగే ప్రజాప్రతినిధులు గంపగుత్తగా కాంగ్రెస్​లో చేరుతున్నారు. 

ఎన్నికల ప్రచారానికి నేతల కరువు..

పార్లమెంట్​ఎన్నికలు బీఆర్ఎస్​కు అగ్ని పరీక్షగా మారాయి. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్​రంగంలోకి దిగారు. కానీ, క్షేత్రస్థాయిలో వలసలు బీఆర్ఎస్​కు పెద్ద సవాల్​గా మారాయి. కాంగ్రెస్ ​ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని బీఆర్ఎస్​ హైకమాండ్ ఆదేశించింది. నియోజకవర్గ మీటింగ్​లు ముగియడంతో ఇప్పుడు ఇంటింటి ప్రచారం మీద ఫోకస్​ పెట్టారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్​పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సూర్యాపేట మినహా అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్​ఖాతాలో చేరాయి. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులతోపాటు బడా, చోటా లీడర్లు అందరూ గంపగుత్తుగా కాంగ్రెస్​గూటికి చేరారు.

భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లో నకిరేకల్​మున్సిపాలిటీ మినహా బీఆర్ఎస్​ ఖాళీ అయ్యింది. మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలతో బీఆర్ఎస్ పాలకవర్గాలను గద్దెదించారు. ఆయా మండలాలు, గ్రామాల్లో బలమైన సామాజిక వర్గాల ముఖ్యనేతలు కాంగ్రెస్​లో చేరడంతో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి నాయకులు కరువయ్యారు. దీంతో ఎన్ని కల ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థంకావడం లేదు. మునుగోడు, కోదాడ, నకిరేకల్, భువనగిరి, దేవరకొండ, నాగార్జునసాగర్​ నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికలను లైట్​గా తీసుకుంటున్నారు. 

కాంగ్రెస్​లో భారీగా చేరికలు.. 

తాజాగా చౌటుప్పుల్​మున్సిపాలిటీలో ఆరుగురు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు, సంస్థాన్​నారాయాణ్​పూర్​ బీఆర్ఎస్​మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, పుట్టపాక మాజీ సర్పంచ్ భాస్కర్ ​తదితరులు ఆదివారం పార్లమెంట్​ ఎన్నికల​ఇన్​చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. దీంతో మునుగోడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఖాళీ అయినట్టే.

బీసీ ఓటర్లు బలంగా ఉన్న మునుగోడులో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆ వర్గం ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొద్దిరోజుల నుంచి మునుగోడు ఎమ్మెల్యే చొరవతో కాంగ్రెస్​లో చేరేందుకు క్యూకడుతున్నారు. దీంతో బీఆర్ఎస్​కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. కాంగ్రెస్​భువనగిరి ఎంపీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రోడ్​షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ చేరికలపై ఫోకస్​పెట్టారు. చివరకు పార్టీలో ఎంత మంది ఉంటారో బీఆర్ఎస్​నాయకులకు అంతుచిక్కడం లేదు.