జమ్మూకశ్మీర్లోని భద్రత సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఎన్కౌంటర్ జరిగింది. జమ్ముకశ్మీర్ పరిధిలోని బారాముల్లాలో BSF భద్రత దళాలపై.. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు..గ్రనైడ్లు, రాకేట్ లాంచర్లతో దాడిచేశారు. దీన్ని భద్రత సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ కాల్పులలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే అధికారులు అలర్టయ్యారు. నిన్న(గురువారం) అర్ధరాత్రి భద్రత సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ(శుక్రవారం) జరిగిన కాల్పులలో మృతి చెందిన ఉగ్రవాది.. పాకిస్తాన్ కు చెందిన ఉస్మాన్గా అధికారులు తెలిపారు. బారాముల్లాలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఎకె-47 రైఫిల్స్, గ్రనైడ్లు, రాకెట్ లాంఛర్లను స్వాధీనం చేసుకున్నట్టు భద్రత సిబ్బంది ప్రకటించారు. వరుస ఉగ్రదాడులతో ప్రస్తుతం బారాముల్లాలో అధికారులు హైఅలర్ట్ను ప్రకటించారు.