
దేశవాళీల్లో పరుగుల వరద పారించి ఇండియా అండర్–19 జట్టుకు ఎంపికైన హైదరాబాదీ ప్లేయర్ ఠాకూర్ తిలక్వర్మ.. రాబోయే ఇంగ్లండ్ సిరీస్లోనూ ఇదే ఆటతీరు కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ వాతావరణం సవాలుతో కూడుకున్నదని, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా తన ఆటతీరు మెరుగుపర్చుకుని జట్టును విజయతీరాలకు చేరుస్తానని పేర్కొంటున్నాడు. ఇంగ్లండ్, బంగ్లాదేశ్లు పాల్గొంటున్న ఈ ముక్కోణపు టోర్నీ.. వరల్డ్ కప్ బెర్త్ కన్ఫామ్ చేయడానికి ఉపకరిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వచ్చే జనవరిలో దక్షిణాఫ్రికాలో జరిగే వరల్డ్కప్ ఈ టోర్నీలో సత్తాచాటిన ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనకు దక్కిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకోవాలని తిలక్వర్మ చూస్తున్నాడు. 2018–19 ఆలిండియా కుచ్ బేహర్ టోర్నీలో తిలక్ పరుగుల వరద పారించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ అయిన తిలక్ ఆ టోర్నీలో ఏడు మ్యాచ్లు ఆడి 86.56 సగటుతో 779 పరుగులు సాధించాడు. అనంతరం జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలోనూ ఎనిమిది మ్యాచ్లు ఆడి 507 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉండడం విశేషం. ఇదే జోరులో హైదరాబాద్ రంజీల్లోనూ అరంగేట్రం చేశాడు. ఈ నేపథ్యంలో ట్రయాంగ్యూలర్ సిరీస్లో సెలెక్టర్లను ఇంప్రెస్ చేసి అండర్–19 వరల్డ్కప్ బెర్త్ సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. తిలక్ గురించి అతని కోచ్ సలామ్ బయాష్ మాట్లాడుతూ.. తను చాలా హర్డ్వర్కింగ్ ప్లేయరని, అతనిలో చాలా ఓపిక ఉందని అభినందించాడు. ఎప్పటికైనా తను ఇండియన్ సీనియర్ నేషనల్ టీమ్కు ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.