పోలీస్ శాఖలో 3,966 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

పోలీస్ శాఖలో 3,966 పోస్టుల భర్తీకి  కేబినెట్ ఆమోదం

రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. 

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని మంత్రివర్గం చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి వాటిని  నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ,తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను  ఆదేశించింది. 

వీటితోపాటు  హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు  వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి  నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.