
అరుణ్ పిళ్లయ్ కవిత ప్రతినిధే..!
ఈ విషయం ఆయనే ఒప్పుకొన్నారు
సౌత్ గ్రూపులో పిళ్లయ్ కీలక సూత్రధారి
లిక్కర్ లాభాలతోనే కవిత భర్త ఆస్తులు కొన్నారు
కోర్టుకు ఈడీ తరఫు న్యాయవాది వివరణ
మేం వాదనలు వినిపించేందుకు టైం ఇవ్వండి
పిళ్లయ్ తరఫు అడ్వొకేట్ అభ్యర్థన
లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలన్న జడ్జి
బెయిల్ పిటిషన్ పై విచారణ 2వ తేదీకి వాయిదా
ఢిల్లీ : లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు ప్రతినిధిగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారని ఈడీ తరఫు న్యాయవాది రౌస్ ఎవెన్యూ కోర్టుకు విన్నవించారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన అరుణ్ పిళ్లయ్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. అరుణ్ పిళ్లయ్ స్టేట్ మెంట్ ఆధారంగానే కవితను విచారించామని కోర్టుకు విన్నవించారు.
లిక్కర్ లో వచ్చిన లాభాలతో ప్రాపర్టీస్ కొనుగోలు చేశారని తెలిపారు. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ఎమ్మెల్సీ కవితతో సమావేశాలు జరిగాయని, ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్ లో ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అందుకే లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోలీసులు ఇచ్చి విచారణ జరిపామన్నారు. తమ వాదనలు వినేందుకు సమయం ఇవ్వాలంటూ పిళ్లయ్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనికి స్పందించిన జడ్జి నాగ్ పాల్ రొటీన్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. లిఖిత పూర్వకంగా వాదనలు అందించాలని సూచించింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది.