ముంబై: 2019 వన్డే వరల్డ్కప్కు అంబటి రాయుడుని సెలెక్ట్ చేసుంటే బాగుండేదని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అంతేకాక తన హయాంలో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా గెలవకపోవడం చాలా బాధగా ఉందన్నాడు. ‘అంబటి రాయుడుని సెలెక్ట్ చేయకపోవడం వెనుక నా ప్రమేయం ఏమీ లేదు. జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లు( ధోనీ, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్) ఉండటం అనవసరం అనిపించింది. అంబటి లేదా శ్రేయస్ అయ్యర్ను తీసుకుంటే బాగుండేది. ధోనీ, పంత్, కార్తీక్ను టీమ్లో ఉంచడం వెనుక లాజిక్ ఏంటో నాకిప్పటికీ అర్థం కాలేదు. కానీ సెలెక్టర్ల పనిలో నేను తలదూర్చలేదు. నా అభిప్రాయం అడిగినప్పుడు మాత్రమే నేను డిస్కషన్లో పాల్గొంటా. కోచ్గా నేనున్నప్పుడు టీమిండియా చాలా అంశాల్లో ఫస్ట్ ప్లేస్ సాధించింది. కానీ ఐసీసీ ట్రోఫీలు సాధించడంలో మూడు సార్లు ఫెయిలవ్వడం చాలా బాధపెట్టే అంశం. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఓటమి మరింత బాధ కలిగించింది. ఐదేళ్ల పాటు టెస్టుల్లో నంబర్ వన్గా ఉన్న మా జట్టు ఫైనల్ మ్యాచ్ ఓడటం కరెక్ట్ కాదు’ అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

