ఈసీ యాక్టివ్! అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ

ఈసీ యాక్టివ్! అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ

ఈసీ యాక్టివ్!
అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ
ఎంసీహెచ్ ఆర్డీలో కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్
రెండు రోజుల పాటు వరుసగా సమావేశాలు
4 రోజుల పాటు రాష్రంలో అధికారుల పర్యటన
సమస్యాత్మక ప్రాంతాలు, స్ట్రాంగ్ రూంలపై సమీక్ష

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో ఎన్నికల కమిషన్ బిజీగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ తో అసెంబ్లీ టెన్యూర్ ముగుస్తుంది. దీంతో ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం (జూన్ 23న) హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఎన్నికల నిర్వహణపై ఈసీ అధికారులు అవగాహన కల్పించారు. రెండు రోజుల పాటు ఈ జరిగే ఈ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు.

ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు అవగాహన కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాలు, స్ట్రాంగ్ రూంల భద్రతపైనా ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతపై సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి..? వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి. వీవీ ఫ్యాట్లున్నాయా..? వాటి తాజా పరిస్థితి ఏమిటి..? అన్న అంశాలపైనా ఇదివరకే సమాచారం తెప్పించుకున్న ఈసీ అధికారులు సమావేశాల అనంతరం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఓ అంచనాకు రానున్నారు. ఇక్కడి పరిస్థితను క్రోడీకరించుకున్న తర్వాత ఈసీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తుంది. వాతావరణశాఖ నుంచి కూడా నివేదిక తీసుకుంటుంది. సాధారణంగా రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఏమిటి..? నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులుంటాయి..? పోలింగ్ నిర్వహణకు ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయా..? అన్న విషయాలను బేరీజు వేసుకున్న తర్వాత తేదీలను ఖరారు చేస్తుంది.