న్యూఢిల్లీ: దేశ ఎకానమీకి ఎటువంటి ఢోకా లేదని ఫైనాన్స్ మినిస్ట్రీ తన లేటెస్ట్ రిపోర్ట్లోనూ వివరించింది. మిగిలిన పెద్ద దేశాలతో పోలిస్తే మన ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని మంత్లీ ఎకనామిక్ రివ్యూలో ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) పేర్కొంది. బడ్జెట్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇన్వెస్ట్మెంట్లు భారీగా వస్తాయని అంచనావేసింది. ‘ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థను మాన్యుఫాక్చరింగ్, కన్స్ట్రక్షన్ సెక్టార్లు ముందుండి నడిపిస్తాయి. ప్రభుత్వం క్యాపెక్స్ పెంచడం, పీఎల్ఐ స్కీమ్ల వలన ఈ సెక్టార్లలో గ్రోత్ ఎక్కువగా కనిపిస్తుంది’ అని వివరించింది. కరోనా వలన ఏర్పడిన అనిశ్చితి తొలగిపోతే, వినియోగం పుంజుకుంటుందని ఫైనాన్స్ మినిస్ట్రీ అంచనావేసింది. వినియోగం పెరిగితే డిమాండ్ పుంజుకుంటుందని, ప్రైవేట్ సెక్టార్ విస్తరించడానికి వీలుంటుందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. జియోపొలిటికల్ టెన్షన్లు, సడెన్గా వచ్చే ఆర్థిక సమస్యలు అడ్డంకులని పేర్కొంది. ‘థర్డ్ వేవ్ టైమ్లో ఎకానమీ నిలకడగా ఉంది. కరెంట్ వాడకం, పీఎంఐ మాన్యుఫాక్చరింగ్ డేటా, ఎగుమతులు, ఈ–వే బిల్స్ వంటి అంశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది.
ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే..
గ్లోబల్ ఎకానమీ పుంజుకుంటుండడంతో మన ఎగుమతులకు ఢోకా లేదని, దేశంలో అందుబాటులో లేని ప్రొడక్ట్ల దిగుమతులు పెరుగుతాయని ఈ రివ్యూ రిపోర్ట్లో ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. దేశ ఎకానమీపై కరోనా ఫస్ట్వేవ్, సెకెండ్ వేవ్ కంటే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉందని తెలిపింది. దేశ ఎకానమీ గ్రోత్ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 శాతంగా నమోదవుతుందని వెల్లడించింది.