లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలువదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జూన్ 4 తర్వాత తెలంగాణ భవన్ క్లోజ్ అవుతుందన్నారు. . కేసీఆర్ సచ్చిన పాములాంటోడన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో వచ్చేది లేదు.. సచ్చేది లేదని మంత్రి అన్నారు. మే 8వ తేదీ బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఎంతో చాలా కీలకమన్నారు. రాముడి పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పదేండ్లు ప్రధాని ఉండి.. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.
రిజర్వేషన్లపై మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఫైరయ్యారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు మత కలహాలు రేపుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయం చేస్తుందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల ముచ్చట ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో భారీ మోసం జరుగుతుందని చెప్పారు. అంబానీ, అదానీ చేతుల్లోనే దేశ సంపద ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 నుంచి 15 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.