కరోనా వచ్చినా.. క్రికెట్ ఆగదు

కరోనా వచ్చినా.. క్రికెట్ ఆగదు

పాజిటివ్‌‌‌‌ వచ్చిన వాళ్లను ఐసోలేట్‌‌ చేసి మ్యాచ్‌‌లు కొనసాగించాలని నిర్ణయం

న్యూఢిల్లీ: ఇండియా–సౌతాఫ్రికా మధ్య టెస్టు, వన్డే సిరీస్‌‌‌‌‌‌లను కరోనా కూడా అడ్డుకోబోదు. ప్లేయర్లు, సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌లో ఎవరైనా కరోనా పాజిటివ్‌‌‌‌గా తేలితే ఆ వ్యక్తిని ఐసోలేషన్‌‌‌‌లో ఉంచి మ్యాచ్‌‌‌‌లు కంటిన్యూ చేస్తారు. ఈ మేరకు  బీసీసీఐ, క్రికెట్‌‌‌‌ సౌతాఫ్రికా (సీఎస్‌‌‌‌ఏ) మధ్య మెడికల్‌‌‌‌ ప్రోటోకాల్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ కుదిరింది.  పాజిటివ్‌‌‌‌గా తేలిన వ్యక్తి  క్లోజ్‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌ను ఐసోలోషన్‌‌‌‌లో ఉంచబోమని సీఎస్‌‌‌‌ఏ మెడికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ షుయబ్‌‌‌‌ మంజ్రా బుధవారం ప్రకటించారు. అదే టైమ్‌‌‌‌లో సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌‌‌‌ ఒమిక్రాన్‌‌‌‌ తీవ్రత పెరిగి, పరిస్థితి చేయిదాటితే బీసీసీఐ ఈ టూర్‌‌‌‌ నుంచి వైదొలగవచ్చని అగ్రిమెంట్‌‌‌‌లో ఉంది. అయితే, ప్రస్తుతానికి అలాంటి చర్య గురించి తాము ఆలోచించడం లేదని బోర్డు సీనియర్‌‌‌‌ అధికారి ఒకరు చెప్పారు. 

మూడు టెస్టుల సిరీస్‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌ ఈ నెల 26న సెంచూరియన్‌‌‌‌లో మొదలవనుంది. జనవరి 19 నుంచి వన్డే సిరీస్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ అవుతుంది. అన్ని మ్యాచ్‌‌‌‌లు ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారు. కాగా, ప్రతి ఒక్కరూ బయో–సెక్యూర్‌‌‌‌ ఎన్విరాన్మెంట్స్‌‌‌‌ (బీఎస్‌‌‌‌ఈ)లో ఉండటం, క్రికెట్‌‌‌‌కు సంబంధించిన వాళ్లంతా ఇప్పటికే వ్యాక్సిన్‌‌‌‌ వేసుకున్న నేపథ్యంలో ఇరు టీమ్స్‌‌‌‌లో ఎవరైనా పాజిటివ్‌‌‌‌గా తేలితే వాళ్లను సంబంధించిన హోటల్‌‌‌‌ రూమ్‌‌‌‌లో ఐసోలేట్‌‌‌‌ చేస్తామని మంజ్రా తెలిపారు. ‘వాళ్లు తమ టీమ్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ పర్యవేక్షణలో ఉంటారు. క్లోజ్‌‌‌‌ కాంటాక్ట్స్​ ఆటను, ట్రెయినింగ్‌‌‌‌ను కొనసాగించొచ్చు. టీమ్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ అందరికీ ప్రతిరోజూ స్క్రీనింగ్‌‌‌‌,  కొవిడ్‌‌‌‌ టెస్టులు చేస్తారు. టూర్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ప్రకారమే కంటిన్యూ అవుతుంది’ అని చెప్పారు. కాగా సీఎస్‌‌‌‌ఏ ఏర్పాటు చేసిన బయో బబుల్‌‌‌‌పై  బీసీసీఐ సంతృప్తి చెందింది.