మేడిగడ్డ ఎగువన జియోట్యూబ్ కట్ట!

మేడిగడ్డ ఎగువన జియోట్యూబ్ కట్ట!

 

  • నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించాలని ప్రతిపాదన
  • జియోట్యూబ్స్ తయారీ సంస్థ వీరేంద్ర టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్ ప్రజెంటేషన్ 
  • 5 కిలోమీటర్లకు రూ.100 కోట్ల ఖర్చయ్యే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉన్నందున ఈ వానకాలం గేట్లన్నీ ఖుల్లా పెట్టాలని నేషనల్​డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పడంతో గోదావరి నీటిని ఎత్తిపోయడానికి ఉన్న ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మేడిగడ్డ ఎగువన జియోట్యూబ్/జియోబ్యాగ్‌‌‌‌లతో కట్టను నిర్మించాలని ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు స్పీడప్​ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం జలసౌధలో ఈఎన్‌‌‌‌సీ అనిల్ కుమార్ నేతృత్వంలో జరిగిన బోర్డ్ ఆఫ్ సీఈ మీటింగ్‌‌‌‌లో జియోట్యూబ్స్ తయారీ సంస్థ వీరేంద్ర టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్ ప్రజెంటేషన్ ఇచ్చింది. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే జియోట్యూబ్ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, సమర్థవంతమైనదని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వీటితో మేడిగడ్డ బ్యారేజీ ఎగువన తాత్కాలిక ఆనకట్టను నిర్మించి పంపింగ్‌‌‌‌ కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​లో భాగంగా ఏజెన్సీ ప్రతినిధులు జియోటెక్స్‌‌‌‌టైల్‌‌‌‌, జియోట్యూబ్‌‌‌‌, జియో మ్యాట్రిస్‌‌‌‌, రోప్‌‌‌‌ గేబియన్స్‌‌‌‌ టెక్నాలజీ ప్రయోజనాలు, తదితర అంశాలపై ఇరిగేషన్‌‌‌‌ శాఖ అధికారులకు వివరించారు. జియోట్యూబ్‌‌‌‌లు, జియోటెక్స్‌‌‌‌ టైల్‌‌‌‌ కంటైనర్లు కరకట్టల రక్షణకు అత్యంత ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. సమీపంలో లభించే ఇసుక, గులకరాళ్లను జియోట్యూబ్‌‌‌‌లలో నింపి ఒకదానిపై ఒకటి పేర్చడం ప్రాజెక్ట్ సైట్లకు మంచిదని, పర్యావరణానికి కూడా ఎంతో అనుకూలమని చెప్పారు. నిర్మాణం, నిర్వహణ ఖర్చు కూడా ఇతర టెక్నాలజీలతో పోల్చితే అతితక్కువగా ఉంటుందని వివరించారు. దీంతో జియోట్యూబ్స్ వైపు ఇంజినీరింగ్ అధికారులు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

5 కిలోమీటర్లకు రూ.100 కోట్లు 

దేశంలో ఈ టెక్నాలజీలోని 2010లో తొలిసారిగా అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో వరదల నియంత్రణకు వాడినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 5 కిలోమీటర్లకుగాను రూ.100 కోట్లు అయినట్టు వివరించారు. ఆ కట్ట ఇప్పటికీ పటిష్టంగా ఉందని చెప్పారు. అస్సాంలోనే కొప్పిలి, బురిదంగ్, సెస్సా, సింగ్రి నదులకూ ఇలాంటి కట్టలు వేశారు. యూపీలో గంగ, రాప్తి, ఖో, గాగ్రా నదులకు సైతం వీటితో కట్టలు నిర్మించారు. వీటి వాడకంపై ఇరిగేషన్‌‌‌‌ శాఖ అధికారులు పలు సందేహాలను లేవనెత్తగా.. ఒకసారి వేస్తే దాదాపు నలబై ఏండ్లపాటు వీటిని వినియోగించొచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, జియోటెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ను వొవెన్, నాన్ వొవెన్, జూట్, సింథటిక్ పద్ధతులతో తయారు చేస్తారు. వీటిలో జియోట్యూబ్స్, జియోబ్యాగ్స్, జియోమ్యాట్రెస్, జియోఫ్యాబ్రిక్, జియోగ్రిడ్, జియోసెల్ వంటి ఆరు రకాలున్నాయి. ప్రస్తుతం మన అధికారులు జియోట్యూబ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీనిపై సీఎం, మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.