మంజీర లోయలో ‘అశోకుడి’ ఆనవాళ్లు

మంజీర లోయలో ‘అశోకుడి’ ఆనవాళ్లు
  • కోటిలింగాల, ధూళికట్ట కంటే ముందునాటివిగా గుర్తింపు
  • తెలంగాణ శాసన చరిత్రలో కొత్త అధ్యాయం అంటున్న రీసెర్చర్లు

హైదరాబాద్, వెలుగు: ఇండియా ఉపఖండాన్ని ఏలిన అశోక చక్రవర్తి ఆనవాళ్లు మెదక్ ​జిల్లా మంజీర తీరంలో బయటపడ్డాయి. బ్రాహ్మీ లిపిలో అశోకుడి బిరుదు రాసి ఉన్న టెర్రకోట పెంకు, ఆ రోజుల్లో పాపులర్‌‌‌‌‌‌‌‌ అయిన బౌద్ధ మత శాసనాలను తెలంగాణ హిస్టరీ రీసెర్చర్లు ఇటీవల కనుగొన్నారు. తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే ఈ ప్రాచీన శాసనాలు.. కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూర్‌‌‌‌‌‌‌‌లో లభించిన శాసనాలకు ముందువని భావిస్తున్నారు. వీటి వివరాలను హిస్టరీ, ఆర్కియాలజిస్టు ఎంఏ శ్రీనివాసన్ మంగళవారం వెల్లడించారు. చరిత్ర పరిశోధకుల బృందం మెదక్​ జిల్లా కుల్చారం గ్రామానికి కిలోమీటర్​ దూరంలోని మంజీర నది రెండు పాయలుగా విడిపోయిన ప్రాంతాన్ని ఇటీవల సందర్శించింది. ఈ నది పాయల మధ్యే ఒకప్పుడు కుల్చారం ఉండేదని, వందల ఏళ్ల క్రితమే ప్రజలు అక్కడి గ్రామాన్ని ఖాళీ చేసి ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. గ్రామం ఖాళీ అయిన ప్రదేశంలోనే  క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నాటి టెర్రకోట పెంకుపై శాసనం దొరికింది. దీనిపై బ్రాహ్మీ లిపిలో ‘దేవానాం’ అని రాసి ఉంది. ఈ పదానికి ముందు బౌద్ధానికి చిహ్నమైన ‘నంది పాద’ ఉండడం విశేషం. అశోకుడికి ‘దేవానాం ప్రియ ప్రియదర్శి (దేవతల ప్రీతిపాత్రుడు, చూపులకు అందమైనవాడు) అనే బిరుదు ఉంది. దీన్నిబట్టి టెర్రకోట పెంకుపై రాసింది అశోకుడి బిరుదేనని, ఆయన బౌద్ధాన్ని ఆచరించిన కారణంగానే  నంది పాదను ముద్రించి ఉంటారని, ఇది మౌర్యుల కాలంనాటి శాసనమేనని ఆర్కియలాజికల్ సర్వే అఫ్ ఇండియా (ఏఎస్‌‌‌‌ఐ)లోని ఎపిగ్రఫీ శాఖ డైరెక్టర్ కన్ఫమ్‌‌‌‌ చేశారు. ఇది ఇండియా హిస్టరీలో అరుదైన విషయమని పేర్కొన్నారు.

రీసెర్చ్‌‌‌‌లతో కొత్త చాప్టర్‌‌‌‌‌‌‌‌..

ఈ పరిశోధన తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపిందని, మంజీర ఒడ్డున, తెలంగాణలో ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ మౌర్యుల కాలానికి చెందిన ఆనవాళ్లు దొరకడం చరిత్రాత్మకమని శ్రీనివాసన్ వెల్లడించారు. మంజీర రెండు పాయల మధ్య వంద ఎకరాల్లో ఉన్న ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు చేస్తే  పెద్ద సంఖ్యలో పురాతన మట్టి కోట గోడల ఆనవాళ్లు, టెర్రకోట వస్తువులు దొరికే చాన్స్‌‌‌‌ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధనలో  ఎపిగ్రఫీ శాఖ డైరెక్టర్ మునిరత్నం, రాష్ట్ర హెరిటేజ్ శాఖ చీఫ్ కేర్ టేకర్ వై.భాను మూర్తి, చరిత్రకారులు డి.సూర్య కుమార్ సపోర్ట్‌‌‌‌ చేశారని తెలిపారు. మూడు నెలలు జరిగిన  ఈ పరిశోధనలో బి.శంకర్ రెడ్డి, బి.నాగరాజు, అరుణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరో మూడు బౌద్ధ శాసనాలు..

టెర్రకోట పెంకు దొరికిన స్థలానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో నాగాసాన్‌‌‌‌పల్లి గ్రామ పరిధిలో మంజీర ఒడ్డున ఉన్న రాక్ షెల్టర్లలో మరో మూడు బౌద్ధ శాసనాలు దొరికాయి. ఈ శాసనాలు క్రీస్తుపూర్వం 1వ శతాబ్ధం, క్రీస్తుశకం 1వ శతాబ్దం నాటి నేచురల్‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌ బ్రాహ్మీ లిపిలో రాసి ఉన్నాయి. ఇందులో ఒక శాసనంలో  ‘హే నమో బుద్ధేయ’, మరో శాసనంలో ‘దమ్మ’ (ధర్మ), మూడో శాసనంలో ‘హే జమ’ అని రాసి ఉన్నాయి.  ఈ గుహల్లో కొత్త రాతి యుగం చివరి భాగం (12 వేల ఏళ్ల క్రితం)లో ఆదిమానవులు వాడిన పనిముట్లకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నట్టు పరిశోధనల్లో గుర్తించారు.