ఓఆర్ఆర్​ కట్టింది.. మంచి నీటిని తెచ్చింది కాంగ్రెస్​ ప్రభుత్వమే

ఓఆర్ఆర్​ కట్టింది.. మంచి నీటిని తెచ్చింది కాంగ్రెస్​ ప్రభుత్వమే
  •  బైరామల్​గూడ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్​బాబు
  •     ఎల్బీ నగర్​ అభివృద్ధికి ప్రయార్టీ ఇవ్వాలి: ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి

ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్​చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది.. సిటీ ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి శ్రీధర్​బాబు చెప్పారు. శనివారం బైరామల్​గూడ ఫ్లైఓవర్​ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సిటీలో ట్రాఫిక్​ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అల్వాల్​లో ఎలివేటెడ్ కారిడార్​కు శుంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. దీర్ఘకాలిక అవసరాలు, భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నలువైపులా డెవలప్​చేస్తామని చెప్పారు. 

అదే సమయంలో జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఎల్బీనగర్​ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి మాట్లాడుతూ.. గత లోక్​సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన రేవంత్​రెడ్డికి మెజారిటీ ఇచ్చిన ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందు ఉండాలని కోరారు. ఎల్బీనగర్​లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అన్నింటిని వివరించేందుకు సీఎంని పర్సనల్​గా కలుస్తానని చెప్పారు. ఎల్బీనగర్​ప్రజలు రేవంత్​ను ఆదరించి ఎంపీగా గెలిపించాకనే, పీసీసీ చీఫ్, ఆ తర్వాత సీఎం అయ్యారని చెప్పారు. 

మేయర్ గద్వాల్​విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న బైరామల్​గూడ ఫ్లైఓవర్​ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరోనా టైంలోనూ పనులను ఆపకుండా ఎస్ఆర్డీపీ కింద వ్యూహాత్మక ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటివరకు సిటీలో 35 ప్రాజెక్టులు పూర్తిచేశామని వివరించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, సిటీ అభివృద్ధికి అందరి సహకారం ఉండాలన్నారు.