900 బిలియన్ డాలర్ల స్టిమ్యులస్ ప్యాకేజికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం
కరోనా వ్యాక్సిన్ డిస్ట్రిబూషన్ కు 15 బిలియన్ డాలర్లు
బిజినెస్డెస్క్, వెలుగు: అమెరికా చరిత్రలోనే రెండో అతిపెద్ద ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజికి యూఎస్ కాంగ్రెస్ మంగళవారం ఆమోదం తెలిపింది. కరోనా రిలీఫ్ ప్యాకేజి 900 బిలియన్ డాలర్లు కాగా, ప్రభుత్వ రెగ్యులర్ ఖర్చుల కోసం 1.4 ట్రిలియన్ డాలర్ల ఫండింగ్కు అనుమతి లభించింది. వీటితో పాటు బిజినెస్ల కోసం ట్యాక్స్ రూల్స్ను సరళీకరించింది. ప్రస్తుతం ఈ బిల్లు ప్రెసిడెంట్ ఆమోదం కోసం డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్కు చేరింది. ఈ వారంలోనే ట్రంప్ ఆమోదం కూడా లభించే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ రెసిసన్లోకి పడకుండా ఉండేందుకు ఈ ప్యాకేజి సాయపడుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితులలో దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా రిపబ్లికన్లు, డెమోక్రటిక్లు ఈ బిల్లును పూర్తి మెజార్టీతో పాస్ చేశారు. నిరుద్యోగ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది అమెరికన్లకు త్వరలో ప్రభుత్వం డబ్బులు వేసే అవకాశం ఉంది. ఇది కేవలం ప్రారంభమేనని, ఇంకా చాలా చేయాల్సి ఉందని ప్రెసిడెంట్గా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. ఈయన జనవరి 20 న ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైరస్ను ఆపడానికి చాలా చేయాలని, వ్యాక్సిన్ కొనడానికి పెద్ద మొత్తం డబ్బులు కావాలని చెప్పారు. కాగా ఈ ఏడాది మార్చిలో 1.8 ట్రిలియన్లతో అతిపెద్ద ప్యాకేజిని ప్రభుత్వం తీసుకొచ్చింది.
చిన్న వ్యాపారాలకు 284 బిలియన్ డాలర్లు..
ఏడాదికి 75,000 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చే అమెరికన్ల అందరికీ 600 డాలర్లను ప్రభుత్వం డైరక్ట్గా పే చేయనుంది. నిరుద్యోగులకు రిలీజ్ చేయాల్సిన అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ను చెల్లించనున్నారు. టెంపరెరీ వర్కర్ల కోసం ప్రభుత్వం అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. చిన్న వ్యాపారాల కోసం 284 బిలియన్ డాలర్ల పే చెక్ ప్రొటెక్షన్ ప్రొగ్రామ్ను ప్రకటించింది.
దీనిలో భాగంగా స్మాల్ బిజినెస్లు ఈజీగా లోన్లను పొందడానికి వీలుంటుంది. కరోనా వ్యాక్సిన్ ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్ కోసం 15 బిలియన్ డాలర్లను ట్రంప్ ప్రభుత్వం కేటాయించింది. బైడెన్ ప్రభుత్వం గోడ కన్స్ట్రక్షన్ను ఆపేస్తారని తెలిసినా మెక్సికో బోర్డర్లో గోడ కట్టేందుకు 1.4 బిలియన్ డాలర్లను ప్రభుత్వం కేటాయించడం విశేషం.
పడి లేచిన మార్కెట్
ఐటీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సోమవారం వచ్చిన నష్టాల్లో మూడో వంతును ఇండియన్ మార్కెట్లు మంగళవారం తిరిగి రికవరీ చేసుకోగలిగాయి. సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం 45,112 పాయింట్ల నుంచి 900 పాయింట్లు పెరిగింది. గత సెషన్ క్లోజింగ్తో పోలిస్తే 453 పాయింట్ల లాభపడి 46,007 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ కూడా ఇంట్రాడే కనిష్టం 13,192 నుంచి 300 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో13,466 వద్ద ముగిసింది. 900 బిలియన్ డాలర్ల ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజికి అమెరికా కాంగ్రెస్ మంగళవారం ఆమోదం తెలిపింది. దీనికి తోడు యూకేలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్పై మా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని జర్మనీ ఫార్మా కంపెనీ బయో ఎన్టెక్ మంగళవారం ప్రకటించింది. ఈ రెండు వార్తలతో యూరప్ మార్కెట్లు భారీగా రికవరీ అయ్యాయి. యురోపియన్ మార్కెట్లతో పాటు ఇండియన్ మార్కెట్లు కూడా తమ ఇంట్రాడే కనిష్టాల నుంచి రికవరీ అవ్వగలిగాయి. సెన్సెక్స్లో హెచ్సీఎల్, టెక్ మహింద్రా, ఇన్ఫోసిస్, పవర్గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
కొత్త రకం కరోనాపై క్లారిటీ వచ్చేంత వరకు ఒలటాలిటీ..
కరోనా అవుట్ బ్రేక్ అయినప్పటికీ గతంలో ఐటీ, ఫార్మా, టెలికాం, ఎఫ్ఎంసీజీ, కెమికల్స్ షేర్లు లాభపడ్డాయి. ప్రస్తుతం ఈ షేర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ బినోద్ మోడీ అన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియా బెటర్ పొజిషన్లో ఉందని చెప్పారు. కొత్త రకం కరోనా వైరస్కు సంబంధించి క్లారిటీ వచ్చేంత వరకు మార్కెట్లో ఒలటాలిటీ కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. లండన్, ఇంగ్లడ్ సౌత్ఈస్ట్ ప్రాంతాలలో ఈ కొత్త రకం వైరస్ విస్తరిస్తోంది. కానీ ఈ వైరస్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందనే వార్తలపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. మంగళవారం సెషన్లో షాంఘై, సియోల్, హాంకాంగ్, టోక్యో మార్కెట్లు నెగిటివ్లో క్లోజయ్యాయి. బ్రెంట్ క్రూడ్ 1.67 శాతం నష్టపోయి బ్యారెల్ ధర 50.06 డాలర్లకు పడిపోయింది. డాలర్ మారకంలో రూపాయి ప్రారంభ నష్టాలను రికవరీ చేసుకోగలిగింది. చివరికి 5 పైసలు బలహీనపడి73.83 వద్ద సెటిల్ అయ్యింది.
