
- రెండుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా.. భర్తీ చేయలే
- రెండు నెలల క్రితం ఇంటర్వ్యూలూ వాయిదా
- అంబుడ్స్మన్లు లేకుంటే ఫండ్స్ ఆపుతామన్న కేంద్రం
- లెక్క చేయని రాష్ట్ర సర్కార్
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పనులపై వచ్చే క్లంప్లయింట్లు, ఎంక్వైరీల కోసం పని చేయాల్సిన అంబుడ్స్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం లేదు. ఉమ్మడి ఏపీలో కొనసాగిన ఈ వ్యవస్థను తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏడున్నరేండ్లుగా పట్టించుకోవడం లేదు. జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు చొప్పున అంబుడ్స్మన్లను నియమించాల్సి ఉన్నప్పటికీ, ఒక్క జిల్లాలోనూ ఈ నియామకాలు చేపట్టలేదు. అంబుడ్స్మన్ను నియమించకుంటే ఈజీఎస్ ఫండ్స్ను ఆపేస్తామని కేంద్రం నుంచి తరచూ హెచ్చరికలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. దీంతో రాష్ట్రంలో అంబుడ్స్మన్ వ్యవస్థ లేకపోవడంతో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేవారు కరువయ్యారు.
నోటిఫికేషన్లు ఇచ్చి.. భర్తీని మరిచిన్రు
జిల్లాకో అంబుడ్స్ మన్ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ పోస్టులు భర్తీ చేయలేదు. ఆ తర్వాత 2021 జనవరి మొదటివారంలో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఒకరు లేదా ఇద్దరిని అంబుడ్స్ మన్గా నియమించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ప్రకటించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఏడాదిపాటు పని చేసేందుకు ఎక్స్ పీరియెన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్లు భారీగా రావడంతో స్క్రూటినీ చేసి డిసెంబర్ నెలలో కొందరు అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరి నిమిషంలో ఇంటర్వ్యూలను రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు ఇంటర్వ్యూలు పెడతారనే విషయం చెప్పలేదు. దీంతో అంబుడ్స్మన్ పోస్టుల భర్తీపై గందరగోళం నెలకొంది.
పద్ధతి మార్చకుంటే లాభంలే
ఉమ్మడి ఏపీలో ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి జిల్లాకో అంబుడ్స్మన్ ఉండేవారు. ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుల స్వీకరణ, రిపోర్టుల తయారీ, చర్యలకు సిఫార్సు చేయడంలో అంబుడ్స్ మన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వీరంతా డీఆర్డీఏ కంట్రోల్ లో ఉండడం, వారికే రిపోర్టు చేయాల్సి రావడం, ఆ ఆఫీసు నుంచే శాలరీ డ్రా కావడంతో చాలా మంది అంబుడ్స్ మన్ లు ఇండిపెండెంట్ గా వ్యవహరించకుండా డీఆర్డీఓలు చెప్పినట్లు వినేవారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన అంబుడ్స్ మన్ పనుల్లో డీఆర్డీఓల జోక్యం పెరగడంతో అంబుడ్స్ మన్ వ్యవస్థకు అర్థం లేకుండా పోయింది. అందుకే ఇకమీదట అంబుడ్స్ మన్ వ్యవస్థలో నేరుగా ఆర్డీ కమిషనర్ కు లేదంటే ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిపోర్ట్ చేసేలా జాబ్ చార్ట్ లో మార్పులు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.