ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. గతంలో టెన్త్ లో 11 పేపర్లు ఉండగా..  వాటి సంఖ్యను ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పది వార్షిక పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. 2022-23 నుంచి పదోతరగతి పరీక్షల్లో సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం పది వార్షిక పరీక్షల పేపర్లను 11 నుంచి ఆరుకు కుదించిన విషయం తెలిసిందే. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది. గ‌తంలో తెలుగు, ఇంగ్లీష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను  చెరో రెండు పేప‌ర్లుగా పరీక్షలు నిర్వహించేవారు. ఇక హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష నిర్వహించేవారు.

పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తున్నామని చెప్పారు. టెన్త్ ఎగ్జామ్స్ సన్నద్ధతపై మంత్రి కార్యాలయంలో  సమీక్షించారు. వంద శాతం సిలబస్ తో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని తెలిపారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.