సీడ్స్ గోడౌన్లో మెడికోల హాస్టల్
కరీంనగర్ మెడికల్ కాలేజీ కోసం తాత్కాలిక ఏర్పాట్లు
మొత్తం 9 కాలేజీల్లో 5 కాలేజీల ఏర్పాటుకు నిధులు విడుదల
ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరో 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ పనులు మొదలు పెట్టింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి పర్మిషన్ వస్తే, వచ్చే ఏడాది నుంచే ఈ కాలేజీలను ప్రారంభించనుంది. ఎన్ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చేలోగా కాలేజీలు, వాటి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ను ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మార్చేందుకు 5 కాలేజీలకు, వాటి అనుబంధ హాస్పిటళ్ల కోసం రూ.34.38 కోట్లు కేటాయిస్తూ సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్లకు అకామిడేషన్ కల్పించేందుకు, అక్కడి సీడ్ గోడౌన్ను రెనొవేట్ చేసి హాస్టల్గా మార్చాలని నిర్ణయించారు. ఇందుకు రూ.7 కోట్లు కేటాయించారు. సిరిసిల్ల హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్న బిల్డింగ్పైన అదనంగా మరో ఫ్లోర్ వేయడానికి రూ.6.8 కోట్లు, కామారెడ్డిలోని పాత టీబీ హాస్పిటల్లో అదనపు బెడ్ల ఏర్పాటు, అదనంగా ఓ ఫ్లోర్ నిర్మాణానికి రూ.8 కోట్లు అలాట్ చేసింది. వికారాబాద్ టీబీ హాస్పిటల్ను రెనొవేట్ చేసి హాస్టల్గా మార్చేందుకు రూ.8 కోట్లు, ఖమ్మం పాత కలెక్టరేట్, ప్రభుత్వ హాస్పిటల్ను మెడికల్ కాలేజీ కోసం రెనొవేషన్ కోసం రూ.7 కోట్లు కేటాయిస్తున్నట్టు జీవోలో పేర్కొంది. ఈ ఐదు జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి.