
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్లో వేధింపులు కలకలం రేపాయి. అర్ధరాత్రి మేయర్కు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఓ అగంతకుడు. మేయర్ విజయలక్ష్మీతో పాటు ఆమె తండ్రి కే కేశవరావు అంతు చూస్తానంటూ అర్ధరాత్రి ఫోన్ కాల్స్తో పాటు వాయిస్ మెసేజ్ పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇటీవల బోరబండలో చనిపోయిన సర్దార్కి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకొచ్చాడు అగంతకుడు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ మేయర్ పీఆర్వో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మేయర్ పీఆర్వో ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ బోరబండకు చెందిన సర్ధార్ ఇటీవల సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.
సర్దార్ మరణం రాజకీయ రంగు పులుముకుంది. బోరబండలో కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, ఆయన కుటుంబ సభ్యులకు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకే బాబా ఫసీయుద్దీన్పై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. సర్దార్ మరణాన్ని బీఆర్ఎస్ రాజకీయం కోసం వాడుకుంటోందని ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలో సర్దార్ మనిషినంటూ గుర్తు తెలియని వ్యక్తి మేయర్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.