చెరువును ఆక్రమించానని అనుకుంటే.. ఈ రోజే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా: పవన్ కల్యాణ్

చెరువును ఆక్రమించానని అనుకుంటే.. ఈ రోజే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా: పవన్ కల్యాణ్

హైదరాబాద్: తెలంగాణలో రూ.500 కోట్ల విలువైన 10 ఎకరాల కోడి చెరువును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కబ్జా చేశారనే ఆరోపణలపై ఆయన స్వయంగా స్పందించారు. చెరువును ఆక్రమించానని అనుకుంటే.. ఈ రోజే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తాను ప్రాపర్టీ ఆక్రమిస్తే సీజ్‌ చేయండని జనసేన అధినేత సవాల్ విసిరారు.

అంతేకాదు.. 2029 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీచేస్తుందని పవన్‌ ప్రకటించారు. అప్పుడు ఎవరు కలిసివస్తారో ఇప్పుడు తెలియదని.. తెలంగాణలో తాను పోటీ చేయనని, తన వాళ్లు గెలిస్తే చాలని పవన్ కల్యాణ్ చెప్పారు.

తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతుందని అడుగుతున్నారని, జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్‌ నడిబొడ్డున అని పవన్ చెప్పారు. ఇది తెలంగాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదని, ఇప్పుడు విమర్శించే గొంతులు 2007లో లేవని పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు.

►ALSO READ | తెలంగాణ బరాబర్‌ మా అయ్య జాగీరే: పవన్కు మంత్రి పొన్నం కౌంటర్

‘‘హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు అడుగుతున్నారు.. మీ అయ్య జాగీరా తెలంగాణ.. మీరెవరు నన్ను బెదిరించడానికి.. బెదిరించేవారికి ఒకటే చెబుతున్నా.. నా ఇంటి అడ్రస్‌ చెప్పడానికే ఇక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టాను’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.