భక్తుల సౌకర్యం కోసమే.. దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రం అలిపిరికి : టీటీడీ ఈవో

భక్తుల సౌకర్యం కోసమే.. దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రం అలిపిరికి : టీటీడీ ఈవో

భక్తుల సౌకర్యం కోసమే దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని అలిపిరికి మార్చినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తులకు టోకెన్లను అక్కడే  జారీ చేయడం వల్ల  అసౌకర్యానికి గురౌతున్నారనే ఫిర్యాదులు వచ్చాయని.. దీంతో శుక్రవారం (జూన్ 6) సాయంత్రం నుంచి  భూదేవి కాంప్లెక్స్ కు తాత్కాలికంగా మార్చినట్లు చెప్పారు. 

 శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో రోజుకు  5 వేల టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు ఈవో.  అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం, భక్తులకు సౌకర్యవంతంగా రవాణా సౌకర్యం, భద్రతా ఉందని ఈవో తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతులు రాగానే అక్కడ టోకెన్లు జారీ చేస్తామన్నారు. 

ఈ సందర్భంగా భక్తులతో టీటీడి ఈవో మాట్లాడారు. దివ్యదర్శనం భక్తులకు టోకెన్లు జారిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడుగగా, భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

సమీక్ష అనంతరం ఉన్నతాధికారులతో కలసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ల జారీని పరిశీలించి, భక్తులతో మాట్లాడారు. 

ఈ కార్యక్రమంలో టీటీడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఅండ్ ఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్థన్ రాజు, సిఈ శ్రీ టివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.