తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణయం

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణయం

రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న జ‌రిగిన‌ తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణయం తీసుకుంది. 2022 సెప్టెంబర్ 17న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాల‌ని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

కేబినెట్ నిర్ణయాలు..
* సెప్టెంబర్ 16న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం

* సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఆవిష్కరించి.. ప్రసంగించనున్నారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు.. మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు.

* సెప్టెంబర్ 17న మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం ఉంటుంది. నెక్లెస్ రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకూ భారీ ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయం. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. 

* సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలని నిర్ణయం. కవులు, కళాకారులను గుర్తించి సత్కరించనున్నారు. తెలంగాణ స్ఫూర్తిని ఘనంగా చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.