జేపీఎస్‌ల రెగ్యూలరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

జేపీఎస్‌ల రెగ్యూలరైజేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌ : జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (JPS) క్రమబద్ధీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రమబద్ధీకరణ విధివిధానాల ఖరారుకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. జేపీఎస్‌ల పనితీరు మదింపునకు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని పేర్కొన్నారు. జేపీఎస్‌లు ప్రొబేషన్‌ పూర్తయిన నేపథ్యంలో తమను రెగ్యూలరైజ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు సమ్మెను విరమించారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (JPS) సర్వీసు క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ అంశంపై సచివాలయంలో చర్చించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర స్థాయి నుంచి కార్యదర్శి లేదా శాఖాధిపతి స్థాయి అధికారి జిల్లా కమిటీకి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ వేస్తారు. జేపీఎస్‌ల పనితీరుపై జిల్లా స్థాయి కమిటీ పంపిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం క్రమబద్ధీకరణ విషయమై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. అటు రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించారు. ఆ స్థానాల్లో కూడా కొత్త జేపీఎస్‌ల భర్తీ ప్రక్రియ, క్రమబద్ధీకరణ తదుపరి దశలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

జేపీఎస్‌లు తమ ప్రొబేషన్‌ పూర్తయిన నేపథ్యంలో రెగ్యూలరైజ్‌ చేయాలని కొన్ని రోజులపాటు  సమ్మె చేపట్టారు. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జేపీఎస్‌లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.