ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు

ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు

ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏప్రిల్‌ 26వ తేదీన ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ భేటీ అయింది. భేటీ వివరాలను రెండు రాష్ట్రాల అధికారులకు పంపింది. భూములు, భవనాల విభజనపై గతంలో ఏపీ 3 ప్రతిపాదనలు చేసింది. ఆస్తుల విభజనపై తాజాగా తెలంగాణ మరో ప్రతిపాదన పెట్టింది.

గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్‌ హాస్టల్‌ పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఇవ్వాలని ప్రతిపాదించింది. కేంద్ర హోంశాఖ.. తెలంగాణ ప్రతిపాదనకు పూర్తిగా భిన్నమైన ప్రతిపాదన చేసింది. 7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమి ఏపీ తీసుకోవాలని పేర్కొంది. ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం సూచించింది. ఏపీకి అదనపు భూమి దక్కితే తెలంగాణకు ఏపీ నుంచి భర్తీ చేసుకోవాలని తెలిపింది.

తాజాగా కేంద్రం చేసిన ప్రతిపాదన తెలంగాణ ప్రతిపాదనకు పూర్తి విరుద్ధంగా ఉంది. విభజన నేపథ్యంలో ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం చెబుతోంది.