
హీరో నాని అక్క దీప్తి గంటా దర్శకత్వం వహించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నాని సమర్పణలో తిపిర్నేని ప్రశాంతి నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీ సిరీస్ ఈ నెల 25 నుండి సోనీ లివ్లో స్ట్రీమ్ అవనుంది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ విశేషాల గురించి నాని, దీప్తి ఇలా ముచ్చటించారు.
‘ఈ స్క్రిప్ట్ కొద్ది పేజీలు చదివేసరికి ఇంటరెస్టింగ్గా అనిపించి కథలో లీనమయ్యాను. అక్క కాకుండా ఇదే స్క్రిప్ట్ను మరొకరు రాసినా ప్రొడ్యూస్ చేసేవాడిని. ఇందులోని క్యారెక్టర్స్, డైలాగ్స్, సిట్యువేషన్స్ అన్నీ చాలా నేచురల్గా ఉంటాయి. ఓటీటీ కోసమే తీశాం. సినిమాల్లో ఉండే డ్రామా ఇందులో కనిపించదు. కానీ ఇందులో క్యారెక్టర్స్, వాళ్ల ముగింపు ఆసక్తి కలిగిస్తుంది. సిరీస్ అంతా ప్లెజెంట్గా ఉంటుంది. ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటాం. నా సిస్టర్ డైరెక్టర్ కనుక ఇందులో నేను నటిస్తానని చాలామంది ఊహించారు. కానీ ఇందులో నాకు క్యారెక్టర్ లేదు. కథలో అవకాశం లేకుండా నటిస్తే కావాలనే కనిపించినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి కంటెంట్ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి వాల్ పోస్టర్ సంస్థ ద్వారా నిర్మిస్తాం’ అన్నాడు నాని.
దీప్తి మాట్లాడుతూ ‘గతంలో నేనొక షార్ట్ ఫిలిం తీశా. ఆ తర్వాత ‘మీట్ క్యూట్’ అని ఒక కథ రాసి నానికి వినిపించా. మరికొన్ని రాస్తే అన్నీ కలిపి ఆంథాలజీ చేయొచ్చు అన్నాడు. తను చెప్పాడని కాకుండా నన్ను ఇన్స్పైర్ చేసే ఆలోచన వచ్చాకే మిగతా కథలు రాశా. ప్రయాణాల్లో తెలియని వ్యక్తులను పరిచయం చేసుకుని మాట్లాడటం నాకు అలవాటు. అలాంటి అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనే ఊహతో ఈ స్క్రిప్ట్ మొదలుపెట్టా. మన లైఫ్లో ఎదురయ్యే ప్లెజంట్ మూమెంట్స్ తో పాటు వివిధ సందర్భాలను ఈ కథల్లో చూపిస్తాం. సత్యరాజ్, రోహిణి, అశ్విన్, ఆదా శర్మ లాంటి మంచి ఆర్టిస్టులు నా కథలోకి రావడం సంతోషాన్నిచ్చింది. అర్బన్ బేస్డ్ స్టోరీస్ అయినప్పటికీ ప్రేక్షకులందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ఫీల్ గుడ్ స్క్రిప్ట్స్ రాసి డైరెక్ట్ చేస్తాను’ అని చెప్పారు.