ఊరంతా ఒక్కతాటిపై నిలబడినందుకు…

ఊరంతా ఒక్కతాటిపై నిలబడినందుకు…

ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా ఒక్కమాట మీద ఉంటే.. ఎంత పెద్ద సమస్య ఎదురైనా అవలీలగా బయటపడగలుగుతారు. టెన్షన్‌ ఫ్రీ లైఫ్‌ గడపగలుగుతారు. అలాంటిది ఊరంతా ఒక తాటి మీద ఉంటే?.. ఒక మాట మీద నిలబడితే? ఏముంది.. ఆ ఊరు డెవలప్ అవుతుంది. డెవలప్ అవ్వడం ఒక్కటేనా? పురస్కారాలు కూడా అందుకుంటుంది. ఆ కోవకే చెందుతుంది ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా‘కె’ అనే ఓ చిన్న పల్లె. చెప్పేందుకు చిన్న ఊరు. కానీ, గ్రామాభివృద్ధిలో భేష్‌ అనిపించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ  పురస్కారానికి సెలెక్ట్ అయింది. దేశం మొత్తంలో తొమ్మిది గ్రామ పంచాయతీలను ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్‌గా సెలెక్ట్ చేస్తే..
అందులో ముఖరా ‘కె’కి చోటు దక్కింది.

ముఖరా‘కె’ ఒక చిన్న ఊరు. ఏడు వందల మంది జనాభా. అసలు ఈ ఊరు ఉందని కూడా చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన  స్వచ్ఛ పురస్కారంతో అందరికీ తెలిసిపోయింది. కేంద్ర జలవనరుల శాఖ ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న గ్రామాల్లో వందశాతం స్వచ్ఛతను సాధించిన ఊరికి స్వచ్ఛ పురస్కారం అందిస్తుంది. ఈ సారి దేశంలోని అన్ని రాష్ట్రాల ఊళ్ల డేటాను పరిశీలించి.. తొమ్మిది  రాష్ట్రాల్లోని తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఓడిఎఫ్​ ప్లస్ (ఓపెన్​ డెఫికేషన్​ ఫ్రీ) స్టేటస్ ఇచ్చింది. మన రాష్ట్రంలో 4,380 గ్రామ పంచాయితీలు ఉంటే.. అందులో ముఖరా‘కె’ గ్రామానికి మాత్రమే ఈ స్టేటస్ దక్కింది!

పదేళ్ల కృషి ఫలితం

ఈ విజయం వెనుక ఆ పదేళ్ల కృషి ఉంది. ‘ఇది నా పని కాదు’ అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఊరి డెవలప్‌మెంట్‌ కోసం పాటుపడ్డారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పథకం తీసుకొచ్చినా పార్టీలకు అతీతంగా.. వాటిని నూరుశాతం ఉపయోగించుకోవడానికి అందరూ కలిసి ఒక ప్లాన్‌ ప్రకారం ముందుకు పోతారు.  కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ, డిజిటల్​ ఇండియా లాంటి పథకాలను వందకు వందశాతం వినియోగించుకొని అందరి మన్ననలు అందుకుంది ఈ పల్లె. ఇప్పుడు ఊళ్లో ఉన్న అన్ని కుటుంబాలకు టాయ్​లెట్స్​ ఉన్నాయి.  ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఉంది. ఉపాధి హామీ పథకంలో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం(విలేజ్​ పార్క్​) లను నిర్మించుకున్నారు.

యూత్‌ మోటివేషన్‌తో..

ఒకప్పుడు ఈ ఊళ్లో చదువు అంతగా లేదు. మరుగు దొడ్లు ఉపయోగించేవాళ్లు కాదు. కానీ, పదేళ్లుగా గ్రామపెద్దలు, యూత్‌ మోటివేషన్‌తో ప్రతి ఫ్యామిలీ మరుగుదొడ్డి కట్టుకుంది. మురుగునీరు బయటకు వదలకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత తవ్వుకున్నారు. దీంతో  ఈగలు, దోమల బెడద లేకుండా పోయింది.  ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేరు వేరుగా తీసుకెళ్తారు. తడి చెత్తను సేంద్రియ ఎరువులుగా తయారు చేస్తూ రైతులకు అమ్ముతున్నారు. దీని వల్ల రైతుకు క్వాలిటీ ఎరువు లభించడంతో పాటు.. గ్రామ పంచాయతీకి రెండు నెలలకు ఒకసారి అదనంగా యాభై వేల రూపాయల ఆదాయం వస్తోంది. ఆ డబ్బును కూడా గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. పదేళ్ల నుంచి మద్యపాన నిషేధం విజయవంతంగా అమలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు (డీ మానిటైజేషన్) టైంలో… ఈ ఊరి యూత్‌ మైక్రో ఏటీఎమ్​లను

ఏర్పాటు చేసి నగదు కొరత రానియ్యలేదు.  ప్రజలను డిజిటల్ లావాదేవీలవైపు మళ్లించడంలో సక్సెసయ్యారు. ఈ ఊళ్లో చదువురాని వాళ్లు కూడా స్మార్ట్​ ఫోన్‌లతోనే  లావాదేవీలు  జరుపుతున్నారు!.

ప్రతి పథకం ఉపయోగించుకున్నం
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి పథకాన్ని మా ఊరి ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా ఊళ్లో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డారు. గ్రామస్తులు అందరి సహకారంతో జాతీయ స్థాయిలో మా గ్రామ పంచాయతీకి ఈ పురస్కారం దక్కింది. ‑ గాడ్గె మీనాక్షి, సర్పంచ్ , ముఖరా‘కె’.

for more News…

గోల్డ్ కు తగ్గుతున్న వాల్యూ.. క్రిప్టోకరెన్సీకి పెరుగుతున్న ఆదరణ

ఇల్లు, ఆస్తులే కాదు..ముఖం కూడా అమ్ముకునే బిజినెస్ స్టార్ట్

20 వేల క్వింటాళ్ల బడి బియ్యం ముక్కిపోయినయ్!