భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య
  • ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

టేకులపల్లి, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందో భార్య. ఈ ఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో జరిగింది. స్థానిక సీఐ బానోత్ రాజు, ఎస్సై రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పానుగోతు తండాకు చెందిన అజ్మీర రాము, లలిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. రాము, లలిత మేకల బేరగాళ్లు. కొన్నేండ్ల క్రితం వృత్తిరీత్యా బయట ఊళ్లకు వెళ్లినప్పడు ఎర్రుపాలెం మండలంలోని అయ్యగారిగూడెంకి చెందిన కంసాని కృష్ణతో వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త లలిత, కృష్ణల వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల భార్య ప్రవర్తనపై రాముకు అనుమానం వచ్చింది. తరచూ ఇద్దరు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా భర్తను అడ్డుతొలిగించుకోవాలని భావించిన లలిత ప్రియుడితో కలిసి చంపేసేందుకు ప్లాన్​చేసింది. గత నెల 15వ తేదీన రాము తల్లి ఇద్దరు మనుమరాళ్లతో కలిసి ఈర్య తండాకు వెళ్లింది. అదే రోజు భర్త రాముతో మేకలు బేరానికి వెళ్దామని చెప్పింది. కృష్ణను పిలిచి ముగ్గురు బయలుదేరారు. ప్లాన్​ప్రకారం బూర్గంపాడు దాటిన తర్వాత గోదావరి ఒడ్డున ముగ్గురూ మందు తాగారు. రాముతో కొంచెం ఎక్కువ తాగించి మత్తులో ఉండగా మెడకు తాడు బిగించి చంపేశారు. అక్కడే ఇసుకలో గుంత తీసి పాతిపెట్టారు. తర్వాత ఏం తెలియనట్లు ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకుని కృష్ణతో కృష్ణ జిల్లాకు వెళ్లింది. ఈ నెల 8వ తేదీన రాము తల్లి లక్ష్మి తన కొడుకు, కోడలు, మనుమరాళ్లు కనిపించడం లేదని స్థానిక పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్​చేసింది. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన లలితను పోలీసులు విచారించగా హత్య విషయం బయటపడింది.