- వనపర్తి జిల్లా కొత్తకోటలో ఘటన
కొత్తకోట, వెలుగు : బ్యాంకులో నుంచి ఓ రైతు డబ్బులు తీసుకొని వస్తుండగా దొంగలు చోరీ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్సై మంజునాథ్ తెలిపిన వివరాల ప్రకారం కానాయపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు వరిధాన్యం పండించిన పంటను విక్రయించగా రూ.2,50,000 వచ్చాయి. పట్టణంలో ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి గురువారం ఆయన తన డబ్బులు డ్రా చేశారు.
తన బైక్ ముందు బ్యాగులో డబ్బులు పెట్టుకొని ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఓ బేకరీ దగ్గర బైక్ ఆపి పెరుగు కోసం వెళ్లారు. పెరుగు తీసుకొని వచ్చే లోపు బైకులో పెట్టిన నగదు కనిపించలేదు. దీంతో శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ పుటేజీ పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.