నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం బాచేపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు.
కంగ్టి సీఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హజ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న కూతురు, అల్లుడికి స్వాగతం పలికేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ కు చెందిన 9 మంది కుటుంబ సభ్యులు స్కార్పియో వెహికల్లో శంషాబాద్ఎయిర్ పోర్ట్ కు బయలుదేరారు.
తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అకోలా, నాందేడ్ హైవేపై బాచేపల్లి వద్ద ఓవర్ స్పీడ్ తో ఉన్న వెహికల్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అవతల వైపు పల్టీ కొట్టింది. తీవ్రగాయాలతో మహమ్మద్ శమీమాబేగం(50), అనాబియాతస్కీం (4), అక్కడికక్కడే చనిపోగా, మహమ్మద్ నదీమ్(32) సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ పరిశీలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
