జీ మీడియా గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థకు రూ. వెయ్యి 322 కోట్లకు పైగా బకాయిలు పడిన వ్యవహారంలో ఆయనతో పాటు మరో ముగ్గురిపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. సుభాష్ చంద్రతో పాటు పంకజ్ సురోలియా, అమిశ్ పాండ్యా, రాజీవ్ ధోలకియా తదితరులపై ఈ మోసం, కుట్ర కేసు నమోదైంది.
తప్పుడు డాక్యుమెంట్లతో లోన్స్..
2018 సంవత్సరంలో సుభాష్ చంద్ర తప్పుడు ఆర్థిక ప్రకటనలు, వివాదాస్పద నెట్వర్త్ సర్టిఫికెట్లను సమర్పించి తమను మోసం చేశారని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తన నికర విలువ రూ.59వేల 113 కోట్లుగా పేర్కొంటూ సర్టిఫికెట్ను సమర్పించారు. ఈ డాక్యుమెంట్లను నమ్మిన ఫైనాన్స్ సంస్థ ఆయనకు సంబంధించిన వివిధ కంపెనీలకు భారీగా లోన్స్ మంజూరు చేసింది.
1. వసంత్ సాగర్ ప్రాపర్టీస్ లోన్: వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం టేకోవర్ & టాప్-అప్ కింద రూ.500 కోట్ల హోమ్ ఎంట్రీ లోన్ మంజూరైంది. దీనికి సుభాష్ చంద్ర కంటిన్యూయింగ్ గ్యారంటీ లెటర్ సమర్పించారు. ఈ లోన్ కోసం 'DIM & Co' ద్వారా జూలై 2018 నాటికి ఆయన నికర విలువ సుమారు రూ. 59వేల113 కోట్లుగా చూపించారు.
2. డిజిటల్ సబ్స్క్రైబర్ లోన్: డిజిటల్ సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, స్పిరిట్ ఇన్ఫ్రా పవర్, మల్టీ వెంచర్స్ సంస్థలకు రెంటల్ డిస్కౌంటింగ్ పద్ధతిలో రూ.480 కోట్ల రుణం ఇవ్వబడింది. దీనికి 'MPJ & Co' చార్టర్డ్ ఖాతాదారులు జూలై 2018లో జారీ చేసిన రూ.40వేల 562 కోట్ల నికర విలువ సర్టిఫికెట్ను ప్రాతిపదికగా తీసుకున్నారు.
దివాలా ప్రక్రియలో వాస్తవాలు..
ఈ లోన్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగి ఆయా ఖాతాలు డిఫాల్ట్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దివాలా అండ్ దివాలా కోడ్ (IBC) 2016 కింద సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఆయన చేసిన ప్రకటనలు సంచలనం సృష్టించాయి. గతంలో ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్కు సమర్పించిన సర్టిఫికెట్లలో పేర్కొన్నట్లుగా తనకు ఎప్పుడూ అంత భారీ నికర విలువ లేదని కోర్టులో స్పష్టం చేశారు. తాను 2024 నాటికి కేవలం రూ.31కోట్ల 79లక్షల నికర విలువ మాత్రమే కలిగి ఉన్నానని, అసలు 2017-18 కాలంలో కూడా తనకు రూ.40వేల కోట్లకు పైగా ఆస్తులు లేవని సుభాష్ చంద్ర అంగీకరించారు.
ALSO READ : కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు.. ఎప్పుడనేది పూర్తిగా CM రేవంత్ ఇష్టం
నేరపూరిత కుట్ర కింద సీబీఐ దర్యాప్తు..
రుణాలు పొందే సమయంలో వేల కోట్ల ఆస్తులున్నట్లు నమ్మించి, తీరా సమస్య వచ్చినప్పుడు తన నికర విలువ అంత లేదని యూటర్న్ తీసుకోవడం స్పష్టమైన మోసం, నేరపూరిత నమ్మకద్రోహం, కుట్ర కిందకు వస్తుందని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ సీబీఐ హెడ్ ఆఫీసుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు భారీ ఆర్థిక మోసం కేసులో లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
