
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఇన్స్పైర్ (ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్) నేషనల్ ప్రోగ్రామ్కు తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 15 నుంచి 21 వరకు జపాన్లో జరిగే సకురా సైన్స్ హైస్కూల్ ప్రోగ్రామ్లో పాల్గొననున్నారు.
ఎంపికైన వారిలో నారాయణపేట జిల్లా దామరగిద్దలోని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో చదువుతున్న ఏ. శివారెడ్డి, మంచిర్యాలకు చెందిన శ్రీచైతన్య స్కూల్ విద్యార్థి సాయి శ్రీవల్లి, కరీంనగర్లోని పరమిత హెరిటేజ్ స్కూల్కు చెందిన శుభ శ్రీ సాహు ఉన్నారు. 2025~-26 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ (ఎన్ఎల్ఈపీసీ)లో మొత్తం 60 ఎగ్జిబిట్స్ టాప్లో నిలిచాయి.
వీటిలో 54 మంది విద్యార్థులను కేంద్రం ఎంపిక చేసినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఏడురోజుల పర్యటనలో జపాన్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలను విద్యార్థులు సందర్శించనున్నారు. అలాగే, నోబెల్ బహుమతి గ్రహీతలతో సంభాషించే అవకాశం కూడా ఉంటుందని వెల్లడించారు.ఈ కార్యక్రమం జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (జేఎస్టీ) ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఇది ఆసియా యువతకు జపాన్లోని అత్యాధునిక సైన్స్, టెక్నాలజీ, సంస్కృతిని తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇన్స్పైర్ ప్రోగ్రామ్లో భాగంగా విద్యార్థులు తమ ఆవిష్కరణలు, ఆలోచనలను ప్రదర్శించి.. జాతీయ స్థాయిలో ఎంపికైన వారే ఈ అవకాశాన్ని పొందుతారు.