నాలుగు నెలల తర్వాత..కామారెడ్డి జిల్లాలోకి మళ్లీ పెద్దపులి

నాలుగు నెలల తర్వాత..కామారెడ్డి జిల్లాలోకి మళ్లీ పెద్దపులి

కామారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో మళ్లీ  పెద్దపులి హల్ చల్ చేస్తోంది. మాచిరెడ్డి రేంజ్ పరిధిలో పెద్దపులి సంచరిస్తుండటంతో అటు ఫారెస్ట్ అధికారులు, ఇటు గ్రామస్తులు ఉలిక్కిపడుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో పులి కదలికలను ఫారెస్ట్ అధికారులు అధికారికంగా గుర్తించారు. గత ఏడాది డిసెంబర్‌లో దోమకొండ, బిక్కనూర్, మాచారెడ్డి ప్రాంతాల్లో పశువులపై దాడి చేసిన అదే పులి.. ఇప్పుడు మళ్లీ తన ఇలాకాలోకి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.

గోదావరి నది దాటి జగిత్యాల మీదుగా నిజామాబాద్‌లోకి ప్రవేశించిన ఈ పెద్దపులి.. అక్కడి నుంచి కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను చుట్టేసి, మళ్లీ ఇప్పుడు మాచారెడ్డి అటవీ ప్రాంతాన్నే తన సేఫ్ జోన్‌గా ఎంచుకుంది. ముఖ్యంగా సిరికొండ అటవీ ప్రాంతంలో గతంలో సంచరించిన సమయంలో, ఇది ఆడ పులి కోసం అన్వేషిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం పులి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగింది. మాచారెడ్డి రేంజ్ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ.. కీలక ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అడవికి ఆనుకుని ఉన్న గ్రామస్తులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని.. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.వరుసగా జిల్లాలు మారుతూ.. మళ్లీ పాత స్థావరానికే చేరుకున్న ఈ పులి ఎక్కడ పంజా విసురుతుందోనన్న భయాందోళనలో స్థానికులు గడుపుతున్నారు."