
ఆసిఫాబాద్ /తిర్యాణి ,వెలుగు: తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 తొలి త్రైమాసికపు డెల్టా ర్యాంకింగ్స్లో సౌత్ జోన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న 500 ఆస్పిరేషన్ బ్లాక్స్లో దక్షిణ జోన్లో ఫస్ట్ ప్లేస్లో ఓవరాల్గా 4వ స్థానం దక్కించుకుంది. అద్భుత పురోగతికి మండలానికి రూ. కోటి గ్రాంట్ లభించింది. ఆ నిధులను మండలంలోని అభివృద్ధి పనులకు వినియోగిస్తారు.
ప్రస్తుతం చేస్తున్న పనుల్లో మరింత వేగం పెంచి, కొత్తవి చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటికే 2023 డిసెంబర్లో విడుదలైన తొలి ఏబీపీ ఆస్పిరేషన్ బ్లాక్స్ ప్రోగ్రామ్) డెల్టా ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ సాధించి రూ.3 కోట్ల గ్రాంట్ పొందింది. నీతి ఆయోగ్ “వాల్ ఆఫ్ ఫేమ్”లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించడంతో జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే మాట్లాడుతూ.. అధికారుల సమన్వయ కృషి, నిబద్ధతతో చేయడంతోనే ర్యాంకు సాధ్యమైందని తెలిపారు. తిర్యాణి మండలం ఆదర్శంగా నిలవడమే కాకుండా, సమర్థవంతమైన పాలనకు ఆదర్శ నమూనాగా మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.