
- గోదావరి జలాల్లో మా వాటా తేల్చాలి: ఎమ్మెల్సీ కోదండరాం
- ప్రాజెక్టులపై కేంద్రం అజమాయిషీని ఖండిస్తున్నాం
- బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంపై మౌనం వీడాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి చిన్నచూపే అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. పెండింగ్ ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వకుండా అజమాయిషీ ప్రదర్శిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మౌనం వెనుక రహస్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బీజేపీ లీడర్లు సమాధానం చెప్పాలన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా తేల్చిన తర్వాతే.. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు.
నాంపల్లిలోని పార్టీ ఆఫీస్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు బీజేపీ లీడర్లు ముందుకు రావాలి. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో భాగస్వాములు కావాలి. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల కారణంగా తెలంగాణకు జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించాలి. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నది. రెండు రాష్ట్రాల మధ్య న్యాయంగా నీటి పంపకాలు జరపాలి. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులతో నీళ్లను గోదావరి బేసిన్ దాటి పెన్నా బేసిన్లో వాడుకునే ప్రయత్నం జరుగుతున్నది’’అని కోదండరాం అన్నారు.
గోదావరి జలాల్లో ఏపీకి 518 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీల నీటి హక్కు ఉందని తెలిపారు. కానీ.. ఇప్పటికే ఏపీ సూమారు 630 టీఎంసీల గోదావరి నీటిని వాడుకున్నదని, కొత్త ప్రాజెక్ట్ ద్వారా అదనంగా మరో 300 టీఎంసీల దాకా నీటిని తరలించే కుట్ర జరుగుతున్నదని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. కేసీఆర్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలిపెట్టారని మండిపడ్డారు.