కార్తీకమాసం:  దీపారాధన ఏ సమయంలో చేయాలో తెలుసా..

కార్తీకమాసం:  దీపారాధన ఏ సమయంలో చేయాలో తెలుసా..

హిందూ పురాణాల  ప్రకారం కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది.   తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కోటి దీపోత్సవం, లక్ష దీపోతవ్సం  వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఎప్పుడు దీపం వెలిగించాలి.. ఏ రకమైన దీపాలను వెలిగించాలి... దీపాలను నూనె లేదా నెయ్యి దేనితో వెలిగించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పురాణాల ప్రకారం, దీపం పరబ్రహ్మ స్వరూపం. దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది. అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడుతుంది. కేవలం సానుకూల శక్తినే ప్రవహింపజేస్తుంది. అందుకే దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు. 

దీపాలను ఎప్పుడు వెలిగించాలంటే..

కార్తీక మాసంలో దీపారాధాన చేసే వారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు. కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి. ఆ తర్వాత సూర్యస్తమయం తర్వాత అంటే సంధ్యా వేళలో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదట. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అందుకే సాయంత్రం 6 తర్వాత దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు.

మట్టి ప్రమిదల్లోనే..

హిందూ సంప్రదాయం ప్రకారం, దీపారాధన చేసే కేవలం మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే జ్యోతిని వెలిగించాలి. ఎందుకంటే మన శరీరం పంచభూతాలకు లోబడి ఉంటుంది. ప్రమిద కూడా మన శరీరానికి ప్రతీకగా ఉంటుంది. అంతేకాదు దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పరిగణిస్తారు.

అగ్గిపుల్లతో అంటించకూడదు..

దీపాన్ని వెలిగించే సమయంలో అన్ని దీపాలను అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ముందుగా ఒక దీపాన్ని వెలిగించి, ఆ తర్వాత ఒక దీపం నుండి మరో దీపాన్ని వెలిగించాలి. ఏక హారతి ప్రత్యేకంగా ముందుగా వెలిగించి ఉన్న జ్యోతి ద్వారానే అన్ని దీపాలను వెలిగించాలి.

దీపారాధన ఎవరు చేయాలంటే..

దీపారాధనను ఎక్కువగా స్త్రీలే చేయాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. కందుల దీపాలను వెలిగించే వారు అందులో ఐదు వత్తులు ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఒక్కో వత్తికి ఒక్కో అర్థం ఉంది. తొలి వత్తి భర్తకు, తమ పిల్లల సంక్షేమం కోసం, రెండో వత్తి కుటుంబ సభ్యుల క్షేమం కోసం, మూడో వత్తి సోదర సోదరీమణుల క్షేమం కోసం, నాలుగో వత్తి ధర్మానికి ప్రతీకగా, అయిదో వత్తి తమ వంశ పురోగతికి ప్రతీకగా పరిగణిస్తారు.

పసుపు రంగు బట్టల్లో..

అయితే సాధారణ దీపాల్లో దీపారాధన చేసే వారు తప్పనిసరిగా రెండు వత్తులు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. పసుపు రంగు బట్టలను ధరించి దీపారాధన చేయడం వల్ల జ్వరం, ఉదర వ్యాధులు, కామెర్ల రోగం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ పొరపాట్లు చేయొద్దు..

దీపారాధన చేసే సమయంలో మనలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. చాలా మంది దీపాన్ని వెలిగించే ముందు ప్రమిదలో వత్తి వేసి ఆ తర్వాత నూనె లేదా నెయ్యిని పోస్తుంటారు. అయితే అలా కాకుండా, దీపాన్ని వెలిగించడానికి ముందే నూనె లేదా నెయ్యి వేసి, ఆ తర్వాత వత్తులను వేయాలి. స్టీల్ పాత్రల్లో దీపాన్ని ఎప్పటికీ వెలిగించొద్దు. స్టీలు ఇనుముతో సమానం. ఇనుము నెగిటివ్​ ఎనర్జీకి సంకేతమని పెద్దలు చెబుతుంటారు.