హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గురువారం 27 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఒకరు మృతి చెందారని తెలిపారు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్. గురువారం ఆయన గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వ్యక్తుల అడ్మిషన్లు, వైద్యం, పరీక్షలు, డిశ్ఛార్జ్ లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 970కి చేరాయన్నారు.
మొత్తం 252 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇవాళ ఒక్క రోజే 58 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. 693 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా ఇప్పటివరకు రాష్ట్రంలో 25 మంది మృతి చెందారని తెలిపారు. భయపడాల్సిన పనిలేదని..రాష్ట్రంలో కరోనా తగ్గుతుందన్నారు. కరోనా నియంత్రణకై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్.