కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉంటా: నరేష్

కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉంటా: నరేష్

నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 50 ఏళ్ళు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని,  జీవితకాలం సినీ పరిశ్రమకు సేవ చేస్తానని చెప్పారు నరేష్.  ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా నరేష్​ మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకొచ్చి 50 ఏళ్లు పూర్తవడం సంతోషంగా ఉంది. వచ్చిన కొత్తలో  ఒక్క సినిమాలో హీరోగా నటిస్తే చాలనుకున్నా. అలాంటిది నా ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో జంధ్యాల, విశ్వనాథ్, బాపు, ఈవీవీ లాంటి మహనీయులతో కలసి పని చేసే అదృష్టం దొరికింది. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నించాను.

ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటా.  విజయాలు వచ్చినప్పటికీ నేను అనుకున్న సినిమాలు చేయలేకపోతున్నాననే ఒక చిన్న నిరాశతోనే తొలి ఇన్నింగ్స్ ముగిసింది.  తర్వాత  రాజకీయాలు, సోషల్ సర్వీస్ కారణంగా దాదాపు పదేళ్ళు పరిశ్రమకి దూరమయ్యా. సెకండ్ ఇన్నింగ్స్‌‌లో పలు వైవిధ్యమైన పాత్రలు వచ్చినపుడు నటుడు ఎస్వీ రంగారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని చేశాను. మీ శ్రేయోభిలాషి , గుంటూరు టాకీస్.  అ ఆ, దృశ్యం లాంటి చిత్రాలలో నా పాత్రలకు మంచి పేరొచ్చింది. 

గత ఏడాది ‘సామజవరగమన’ నాకు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. లీడ్ రోల్‌‌లో చేసిన ‘మళ్ళీ పెళ్లి’ తో పాటు ఓటీటీలో చేసిన ఇంటింటి రామాయణం, మాయాబజార్‌‌‌‌లో  మంచి పాత్రలు చేశా.  ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్, రైటర్స్‌‌తో వర్క్ చేయడం హ్యాపీ. ఇంకా కొత్త కొత్త పాత్రలు వస్తున్నాయి. నాకైతే నెగిటివ్ రోల్స్ చేయాలని ఉంది. ఇక మా విజయ కృష్ణ గ్రీన్‌‌ స్టూడియోస్‌‌ని కంప్లీట్ మోడరన్ స్టూడియోగా చేస్తున్నాం”అని  చెప్పారు.