వెళ్లేది లేదు.. ఆపేది లేదు..

వెళ్లేది లేదు.. ఆపేది లేదు..

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన ఆందోళనతో సినీ ఇండస్ట్రీలో అలజడి నెలకొంది. వేతనాలు పెంచే వరకు సినిమా షూటింగ్ లకు వెళ్లేది లేదని సినీ కార్మిక సంఘాలు తేల్చిచెప్పగా... షూటింగ్ లు ఆపే ప్రసక్తే లేదని నిర్మాతల మండలి స్పష్టం చేసింది. కార్మికులు ఆందోళన విరమించి షూటింగ్ లో పాల్గొనాలని కోరింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ విజ్ఞప్తిని ఫిల్మ్ ఫెడరేషన్ తిరస్కరించింది. 45% వేతనాలు పెంచే నిర్మాతల షూటింగ్ లకే సినీ కార్మికులు వెళ్తారని చెప్పింది. వేతనాలు సవరించే వరకు కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని ఫిల్మ్ ఫెడరేషన్ మరోమారు స్పష్టం చేసింది. 

24 విభాగాలకు చెందిన కార్మికులు..

సినీ కార్మికుల ఆందోళన యావత్ చిత్ర పరిశ్రమను గందరగోళంలో పడేసింది. గత మూడేళ్ల నుంచి వేతనాలు పెంచడం లేదని, వెంటనే ఇప్పుడున్న వేతనాలను సవరించి 45 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ 24 విభాగాలకు చెందిన కార్మికులు హైదరాబాద్ వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సాధారణ కార్మికుల కంటే సినీ కార్మికులు ఎంతో కష్టపడుతున్నారని, వేతనాలను పెంచి తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  కాస్ట్యూమ్ యూనియన్ కు చెందిన సినీ కార్మికుడు రాజేశ్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న పోలీసులు అతని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  సినీ కార్మికుల ఆందోళనపై స్పందించిన ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు... నిర్మాతల మండలితో చర్చించి వేతనాలు పెంచేలా చేస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. వేతనాలు పెంచే నిర్మాతల చిత్రాలకే రేపటి నుంచి కార్మికులు పనికి వెళ్తారని స్పష్టం చేశారు. ఫెడరేషన్ నాయకుల హామీతో సినీ కార్మికులు ఆందోళన విరమించారు.

తప్పుపట్టిన ప్రొడ్యూసర్ కౌన్సిల్

సినీ కార్మికుల ఆందోళనను ప్రొడ్యూసర్ కౌన్సిల్ తప్పుపట్టింది. వేతనాల పెంపుపై చాలా రోజుల నుంచే ఫిల్మ్ చాంబర్ ఆలోచిస్తుందని, ఈలోగా కార్మికుల ఆందోళన చేయడం వల్ల ఇండస్ట్రీకి చాలా నష్టం వాటిల్లిందని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ తెలిపారు. సినిమా చిత్రీకరణల నిలిచిపోవడం, కార్మికుల వేతనాలపై నిర్మాతలు, ఫిల్మ్ చాంబర్ సంయుక్తంగా సమావేశమై చర్చించాయి. వెంటనే కార్మికులు రేపటి నుంచి షూటింగ్ లకు హాజరుకావాలని, వేతనాల పెంపుపై ఎల్లుండి చర్చిస్తామని సి.కళ్యాణ్ తెలిపారు. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి నిర్మాతలు ఎవరూ వేతనాలు పెంచవద్దని సూచించారు. 

విబేధాలు సృష్టిస్తే..

ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి సినీ కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. సినీ కార్మికుల్లో విబేధాలు సృష్టిస్తే నష్టపోయేది నిర్మాతలేనన్న ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్... పాత పద్దతుల్లో కార్మికులెవరూ చిత్రీకరణలకు హాజరుకారని వెల్లడించారు. 45 శాతం పెంచిన కొత్త వేతనాలతోనే సినిమా చిత్రీకరణలకు హాజరవుతారని తెలిపారు. అప్పటి వరకు సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతుందన్నారు. కాగా, సినీ కార్మికుల ఆందోళన కారణంగా సుమారు 25కు పైగా ఇండోర్, ఔట్ డోర్ లొకేషన్లలో సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. దాదాపు 5 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోగా... నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.