వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్ పరిధిలోని హరిత కాకతీయ హోటళ్లలో పర్యాటకులకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఓరుగల్లు పరిధిలోని హరిత టూరిజం హోటల్స్లో కొన్ని నెలలుగా రెస్టారెంట్ల నిర్వహణ లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఈ నెల 10న ‘వెలుగు’ పేపర్లో ‘హరిత హోటల్స్పై టూరిస్టులు నారాజ్’ పేరుతో కథనం పబ్లిష్ అయింది. దీనిపై రాష్ట్ర టూరిజం శాఖ ప్రధాన అధికారులు స్పందించారు. హరిత హోటళ్లలో పాడైన ఏసీలు, టీవీలను రిపేర్ చేయించామన్నారు.
రామప్ప, ములుగు గట్టమ్మ, బొగత, మేడారం, తాడ్వాయి హరిత హోటల్స్ రెస్టారెంట్ల నిర్వహణ కోసం ఇప్పటికే రెండుసార్లు టెండర్లు ఆహ్వానించామన్నారు. మరో అవకాశం వరకు చూసి టూరిజం కార్పొరేషన్ ద్వారానే వాటిని పున:ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. పాకాల టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో స్థానిక టూరిజం హోటల్ను ఫారెస్ట్ డిపార్టుమెంట్కు బదలాయించినట్లు పేర్కొన్నారు. లక్నవరం సరస్సులోని గ్లాస్ గదులు తుఫాన్ కారణంగా ధ్వంసమైనందున తిరిగి కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
