
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి విపరీతంగా పెరిగిపోయింది. దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. గ్రీన్ కాకర్స్ వాడాలనే ఆదేశాలున్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో నగరమంతా విషపూరిత పొగమంచుతో కమ్ముకుంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో AQI 400కు పైగా నమోదు అయింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) విడుదల చేసిన గణాంకాల ప్రకారం. ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) చాలా ప్రాంతాల్లో 400కు పైగా నమోదైంది. ఇది ప్రమాదకర స్థాయి వాయుకాలుష్యం. గత సంవత్సరం దీపావళి తర్వాత రోజున 296 పాయింట్ల ఏక్యూఐ నమోదుకాగా.. ఈసారి దీపావళి రోజు సాయంత్రానికే 400 పాయింట్లు దాటినట్లు తెలుస్తోంది. పటాకుల మోతతో సోమవారం రాత్రికే ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది. విషపూరిత వాయువులు వాతావరణంలో కలిసి ఢిల్లీ ప్రజలను ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశాయి. ఢిల్లీలోపెరుగుతున్న వాయుకాలుష్యం తమ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దీపావళికి గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా.. రాత్రి 8 నుంచి 10 గంటల దాకా మాత్రమే పటాకులు కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. కోర్టు ఆదేశాలు జనం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.దీపావళికి ఆరు రోజుల ముందు నుంచే ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడం గమనార్హం..
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉంటే కాలుష్యం లేదని.. ఎయిర్ క్వాలిటీ బాగుందని అర్థం. ఏక్యూఐ 100 నుంచి 200 మధ్య మధ్యస్తంగా ఉందని, 200 నుంచి 300 మధ్య ఉంటే ఎయిర్ క్వాలిటీ అద్వాన్నంగా ఉందని, అదే 300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయి. 400 నుంచి 500 మధ్య ఉంటే పొల్యూషన్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు, మరింత ప్రమాదకరమని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ చెబుతుంది.