దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నాయకులు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నాయకులు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

కామారెడ్డి: బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నాయకులని ఘాటు విమర్శలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్న సందర్భంగా 2025, సెప్టెంబర్ 15న కామారెడ్డిలో నిర్వహించనున్న విజయోత్సవ సభ ఏర్పాట్ల కోసం ఆదివారం (సెప్టెంబర్ 7) కామారెడ్డిలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షట్కార్, ఎమ్మెల్యేలు మదన్ మొహాన్, లక్ష్మీ కాంతరావ్, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మీరు లేకుంటే కాంగ్రెస్ పార్టీనే లేదని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ జరగనున్న సెప్టెంబర్ 15వ తేదీతో సరిగ్గా తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి అవుతుందని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి గడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చిందని.. మాట ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చాక కుల గణన సర్వే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నామన్నారు.  

బీసీల సంక్షేమం కోసం రాష్ట్రంలో కుల గణన చేసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని.. ఆయన బీసీ వర్గానికి చెందకున్నా బీసీల సంక్షేమం కోసం డిక్లరేషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బాగోతం బయటపెట్టడానికే లక్షలాది మందితో కామారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభ జరుపబోతున్నామన్నారు.

 ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ అని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మూడు బిల్లులను కేంద్రానికి పంపించాం. కానీ కేంద్రంలోని బీజేపీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. బీసీ అని చెప్పుకునే బండి సంజయ్ ఓ దేశ్ ముఖ్‎లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ALSO READ : ఆలస్యమైనా పర్వాలేదు.. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 బండి సంజయ్‎కు దమ్ముంటే పోలీసుల రక్షణ లేకుండా తిరగాలని సవాల్ విసిరారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ బీసీల గురించి మాట్లాడటం లేదని.. మీకు చిత్తశుద్ధి, బీసీలపై ప్రేమ ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల బట్టలు ఊడదీసేందుకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో 15న విజయోత్సవ సభ నిర్వహించబోతున్నామనితెలిపారు.

 కామారెడ్డి విజయోత్సవ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖరావం పూరించబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ దొంగల ముఠా: 

బీఆర్ఎస్ పార్టీ దొంగల ముఠా అని విమర్శించారు. దేశంలో అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు.
రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని ఎన్నికల సమయంలోనే చెప్పానని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బిడ్డగా కవితను ఆదరిస్తాం కానీ లిక్కర్ రాణిగా ఒప్పుకోమని స్పష్టం చేశారు. వాటాల విషయంలో తేడాలు రావడంతో కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. ఆమె ఈ విషయాలు ఐదేళ్ల క్రితం చెప్పుంటే ప్రజలు నమ్మే వారని.. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు.