బీజేపీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్రమంత్రిగా ఉండి కూడా రాష్టానికి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలతో ప్రశంసలు అందుకుంటుందన్నారు. ఇందుకు జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. బీజేపీకి డిపాజిట్ దక్కించుకోలేని కిషన్ రెడ్డి ఒకసారి ఆలోచించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రజల మెప్పు పొంది ప్రజల ముందు గర్వంగా నిల్చున్నామన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్ల రూ. 8 లక్షల కోట్ల అప్పుతో రాష్టాన్ని అప్పజెప్పారని తెలిపారు. ఓ వైపు వడ్డీలు కడుతూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంకా మూడేళ్ళలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామన్నారు మహేశ్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ నయవంచన: కిషన్ రెడ్డి
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీలేనని విమర్శించారు కిషన్ రెడ్డి. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు రాష్ట్రంగా మార్చిందన్నారు. సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి నయవంచన చేసిందన్నారు . రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ప్రజా పాలన ఉత్సవాలు జరుపుకుంటున్నరని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా? అని అడిగారు. తెలంగాణలో ఏ రంగంలో మార్పు వచ్చిందో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి.
