సింగరేణి అవకతవకల విచారణపై తొలిసంతకం : రేవంత్ రెడ్డి

సింగరేణి అవకతవకల విచారణపై తొలిసంతకం : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేటుకు అప్పగించి 25వేల కోట్ల దోపీడికి యత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయొద్దని పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అధికారి సీఎండీగా ఉండటానికి వీల్లేదన్న రేవంత్..  రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా సీఎండీగా కొనసాగడం దుర్మార్గమన్నారు. 

10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. సింగరేణిలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులను కటకటాల్లోకి పంపిస్తామని రేవంత్ చెప్పారు. ఓపెన్ కాస్ట్ మైన్తో కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో గనికార్మికుల పాత్ర ఎంతో ఉందని.. ఒకప్పుడు 70వేలు ఉన్న ఉద్యోగులు 40వేలకు తగ్గిపోయారన్నారు. రెగ్యులర్ కార్మికులను తొలగించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మండిపడ్డారు. అండర్ గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కార్మికుల సమస్యలను కాంగ్రెస్ పరిష్కరిస్తుందని.. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.