గ్రేటర్ ఎన్నికలతో కేసీఆర్ ఖేల్ ఖతం

గ్రేటర్ ఎన్నికలతో కేసీఆర్ ఖేల్ ఖతం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలతో కేసీఆర్ పనైపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉత్తమ్.. టీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌‌కు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, ఎంఐఎం తిట్టుకుంటున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌‌కు ఓటేస్తే అభివృద్ధి చేస్తామన్నారు.

‘హైదరాబాద్‌‌కు కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో కేసీఆర్ పని అయిపోతుంది. కేసీఆర్ ఆరున్నరేండ్లలో లెక్కలేనంత అవినీతి చేశాడు. బీజేపీ నేతల ప్రవర్తన హైదరాబాద్‌‌ను అవమానించేలా ఉంది. అమిత్ షా డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఉండి హైదరాబాద్‌‌లో వంద మంది చనిపోతే రాలేదు. కానీ ఎలక్షన్లు అంటే వచ్చాడు. ఉత్తరప్రదేశ్‌‌లో దళిత మహిళపై అత్యాచారం జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని కూడా యోగి ఆదిత్యనాధ్ పరామర్శించలేదు. యోగి ఆదిత్యనాధ్ తన పేరును మార్చుకున్నంత సులువుగా హైదరాబాద్ పేరును మార్చలేరు. హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే. కృష్టా గోదావరి నదీ జలాలు, మెట్రో, రింగ్ రోడ్డు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఏరియాల్లో అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలి’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.