వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‎లో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‎లో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీ/అంబర్​పేట/ పద్మారావునగర్, వెలుగు: బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆదివారం, సోమవారం పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలను విధించినట్లు సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. లాల్‌ దర్వాజ సింహవాహిని ఆలయ పరిసరాల్లో ఆదివారం సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. ఇంజిన్​బౌలి, ఫలక్​నుమా వైపు నుంచి ఆలియాబాద్‌ వైపుకు వచ్చే వాహనాలను న్యూ షంషేర్​గంజ్‌ నుంచి గోశాల, మిస్రీగంజ్‌ వైపు మళ్లిస్తారు. 

మహబూబ్​నగర్‌ క్రాస్​రోడ్‌ నుంచి ఆలియాబాద్‌ వైపు వచ్చే వాహనాలను ఇంజిన్​బౌలి నుంచి జహనుమా, గోశాల వైపు మళ్లిస్తారు. నాగులచింత, సుధా టాకీస్‌ వైపు నుంచి లాల్‌ దర్వాజ వైపు వచ్చే వాహనాలను గౌలిపురా వైపు పంపుతారు. చార్మినార్‌ వైపు నుంచి నాగులచింత వైపు వచ్చే వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్‌ వైపు మళ్లించనున్నారు. గౌలిపురా నుంచి లాల్ దర్వాజ వైపు వచ్చే ట్రాఫిక్​ను సుధా టాకీస్ వద్ద హరి బౌలి మీదుగా మీర్​చౌక్ వైపు మళ్లిస్తారు. 

రాజన్న బౌలి నుంచి లాల్ దర్వాజ ఆలయం వైపు వచ్చే ట్రాఫిక్​ను వెంకటేశ్వర స్వామి ఆలయం లేన్ వద్ద రామస్వామి గంజ్ వైపు డైవర్ట్​చేయనున్నారు. మదీనా క్రాస్​రోడ్స్ నుంచి ఇంజిన్ బౌలి వరకు ప్రధాన రహదారి, గుల్జార్ హౌస్ - చార్మినార్ స్మారక చిహ్నాలు, చార్మినార్ బస్ టెర్మినల్, హిమ్మత్‌పురా, నాగులచింత, అలియాబాద్ మధ్య బోనాలు ఊరేగింపులు ముగిసే వరకు అన్ని రకాల వాహనాలను అనుమతించరు.

అంబర్​పేటలోని మహంకాళి ఆలయం పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. -ఉప్పల్ నుంచి చాదర్​ఘాట్, ఎంజీబీఎస్ వైపు వెళ్లే వాహనాలను నేరుగా అంబర్‌పేట ఫ్లైఓవర్​పై అనుమతిస్తారు. 

చాదర్​ఘాట్, ఎంజీబీఎస్​ నుంచి వచ్చే వచ్చే వాహనాలు అంబర్​పేట ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సిటీ బస్సులు, జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కూడా ఇదే రూట్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. బోనాల వేడుకకు వచ్చే భక్తులు అండర్​పాస్ ద్వారా జీహెచ్‌ఎంసీ మైదానంలో తమ వాహనాలను పార్క్ చేయవచ్చు.

చిలకలగూడ కట్టమైసమ్మ పోచమ్మ ఆలయ పరిసరాల్లో నేడు, రేపు  ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాలను అనుమతించరు. సీతాఫల్​మండి, ఆలుగడ్డబావి నుంచి వచ్చే వాహనాలను వారాసిగూడ, నామలగుండు, పద్మారావు నగర్ పరిసర ప్రాంతాల వైపు మళ్లిస్తారు. చిలకలగూడ క్రాస్ రోడ్స్ నుంచి సీతాఫల్ మండి వైపు వచ్చే వాహనాలను పద్మారావు నగర్ టీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. మున్సిపల్‌ మైదానాన్ని వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తామన్నారు.