పెళ్లైన 9 రోజులకే.. భార్యను చంపి ఆత్మహత్య.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే..!

పెళ్లైన 9 రోజులకే.. భార్యను చంపి ఆత్మహత్య.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే..!

చెన్నై: తమిళనాడులోని చెన్నై శివార్లలో ఉన్న కుంద్రత్తూర్లో దారుణం జరిగింది. పెళ్లైన 9 రోజుల్లోనే భర్త తన భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. చెన్నైలోని తలపతి వీధి పక్కన ఉన్న కుంద్రత్తూర్లోని మూడవ వార్డులో విజయ్ (25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. విజయ్ చెన్నైలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. తనతో పాటు పనిచేసే యువశ్రీ (24) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుని కుంద్రత్తూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు.

శుక్రవారం రాత్రి ఇద్దరూ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో, ఆ నవ వధువు చెల్లెలు వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. చాలా సేపటి వరకు తలుపు తెరవకపోవడంతో కుంద్రత్తూర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో మంచం మీద యువశ్రీ చనిపోయి ఉండటాన్ని, విజయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చూసి పోలీసులు షాక్ అయ్యారు. 

ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించి దర్యాప్తు చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరికీ పెళ్లైన వారం రోజులకే అభిప్రాయ భేదాలు తలెత్తాయని పోలీసులు చేసిన దర్యాప్తులో వెల్లడైంది. ఈ కారణంగా.. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో.. భర్త కోపంతో.. క్షణికావేశంలో తన భార్యను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. 

►ALSO READ | జగిత్యాల జిల్లాలో విషాదం.. కొండగట్టులో దర్శనం.. గంటలోనే కారు యాక్సిడెంట్.. భార్యాభర్త స్పాట్ డెడ్

ఈ సంఘటనకు వేరే కారణం ఉందా అనే కోణంలో కూడా కుంద్రత్తూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జంట మరణించడం దిగ్భ్రాంతిని కలిగించింది. యువశ్రీ శరీరంపై ఎటువంటి గాయాలు లేనప్పటికీ, ఆమె ముఖంపై దిండు లాంటి వస్తువును ఉపయోగించడం వల్ల ఆమె ఊపిరాడక చనిపోయి ఉండవచ్చనే కోణం నుంచి వారు దర్యాప్తు చేస్తున్నారు.