
న్యూఢిల్లీ: 242 మంది మృతికి కారణమైన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భాంత్రికి గురి చేయగా.. ఇంతలోనే మరో ప్రమాదం జరిగింది. విమానం క్రాష్ అయిన గంటల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో రైలు పట్టాలు తప్పింది. గురవారం (జూన్ 12) సాయంత్రం శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్తున్న 64419 అనే లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
పట్టాలు తప్పిన బోగీలను ట్రాక్ నుంచి పక్కకు తొలగించారు. రైలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడంతో ఈ రూట్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోచ్ పట్టాలు తప్పడానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఘటన స్థలానికి చేరుకున్న ఇంజనీరింగ్ నిపుణులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read : గుజరాత్ విమాన ప్రమాదంపై విదేశాంగ శాఖ ప్రకటన
ఈ ప్రమాదాన్ని ఉత్తర రైల్వే ధృవీకరించింది. గురువారం (జూన్ 12) సాయంత్రం 4:10 గంటలకు శివాజీ వంతెన సమీపంలో రైలు కోచ్ నంబర్ 64419 (NZM-GZB EMU) పట్టాలు తప్పిందని తెలిపింది. ఘటన స్థలంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయని.. ఈ సంఘటనలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది. ప్రాణనష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.