రైళ్లలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్​

రైళ్లలో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్​
  •  131 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

సికింద్రాబాద్, వెలుగు: రైళ్లలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడితో పాటు ముగ్గురి ముఠాను రైల్వేపోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 131 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే అర్బన్ డీఎస్పీ జావేద్, ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తో కలిసి మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిపిరాల గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్న(38), ఓర్సు నవీన్(25), ఓర్సు అశోక్(30) , మరో మైనర్​ ఉపాధి కోసం నగానికి వచ్చి దమ్మాయిగూడ, చక్రిపురంలో ఉంటూ... భవన నిర్మాణ కూలీలుగా పనులు చేస్తున్నారు. కూలి పనులతో వచ్చే డబ్బులు సరిపోకోవడంతో సెల్ ఫోన్ చోరీలు మొదలు పెట్టారు. ఫోన్లు అమ్మగా వచ్చిన డబ్బు కూడా సరిపోకపోవడంతో వీరు రైళ్లలో చైన్ స్నాచింగ్​లు మొదలు పెట్టారు. 

రైలు ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలు కొట్టేసి వాటిని అమ్మి, జల్సాలు చేస్తున్నారు. బాధిత ప్రయాణికుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. 

దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకోవడంతో వారి నుంచి రూ .10లక్షల విలువైన 131 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మైనర్ ను జువెనైల్ హోం కు తరలించిన పోలీసులు మిగతా ముగ్గురిని రైల్వే కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ జావేద్ తెలిపారు . కాగా వీరి పై సికింద్రాబాద్​​, నల్గొండ రైల్వే పోలీసు స్టేషన్ల పరిధిలో 7 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.