VRS బాటలో రవాణా శాఖ అధికారులు : ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్

VRS బాటలో రవాణా శాఖ అధికారులు : ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్

రవాణ శాఖలో ఉన్న ఘరానా తిమింగలాలను పట్టుకునే పనిలో ఉంది అవినీతి నిరోధక శాఖ (ACB). ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రావాణ శాఖ కార్యాలయాలలో మూకుమ్మడి దాడులు నిర్వహిస్తోంది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నంత పని అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తూ ఏసీబీకి చిక్కితే  అక్రమాస్తులు బయటపడ్తాయోననే భయంతో చాలామంది అధికారులు వీఆర్ఎస్​ ప్లాన్ చేస్తున్నారు అవినీతి అనకొండలు.

రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖలోని వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న 100 మందికి పైగా అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ.. ఆయా అధికారులపై ఆధారాలతో సహా నివేదికలు రెడీ చేసి సీఎంవోకు అందజేసింది. ఈ క్రమంలోనే తాజా దాడులు జరిగినట్లు తెలుస్తున్నది. సోమవారం ఖమ్మంలో, మంగళవారం మహబూబ్ నగర్ లోని రవాణా శాఖ అధికారుల ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిగాయి. ఈ మధ్య కాలంలో భువనగిరి ఎంవీఐ సురేందర్ రెడ్డిపై, వరంగల్ డీటీసీగా ఉన్న శ్రీనివాస్ పై కూడా ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. 

ఆర్మూర్ ఎంవీఐ వివేక్, జగిత్యాల డీటీవో భద్రు నాయక్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రవాణా శాఖలో గుట్టుగా సాగిన అక్రమ దందాకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెక్​పెట్టడం వల్లే ఈ రెండేండ్ల కాలంలో రవాణా శాఖ అధికారులపై పెద్దసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తూ ఏసీబీకి చిక్కితే ఎక్కడ అక్రమాస్తులు బయటపడ్తాయోననే భయంతో చాలామంది అధికారులు వీఆర్ఎస్​ తీసుకుంటున్నారు. నెల రోజుల కింద కామారెడ్డి డీటీవో శ్రీనివాస్ రెడ్డి ఇలాగే వీఆర్ఎస్ తీసుకోవడంపై రవాణాశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జేటీసీ పాపారావు, ఎంవీఐ చక్రవర్తి వీఆర్‌‌‌‌ఎస్ తీసుకున్నారు. పాపారావు.. బీఆర్ఎస్ సర్కార్  హయాంలో రవాణా శాఖలో కీలకంగా వ్యవహరించారు. తాజాగా పట్టుబడిన డీటీసీ కిషన్ నాయక్ ఈయనకు అత్యంత సన్నిహితుడని సమాచారం. ఇక ఇప్పుడు జరుగుతున్న ఏసీబీ దాడులతో మరో 3, 6 నెలల్లో రిటైర్మెంట్ కానున్న పలువురు అధికారులతో పాటు ఏడాది సర్వీసు ఉన్న ఆఫీసర్లు సైతం వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు రవాణా శాఖలో చర్చ జరుగుతున్నది.