
- 18 మంది ప్రయాణికులకు గాయాలు
- యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘటన
చౌటుప్పల్, వెలుగు : బ్రేక్డౌన్ కావడంతో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోగా, మరో 18 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... శివాంజలి ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తోంది.
ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం కైతాపురం స్టేజీ వద్దకు రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రావెల్స్ బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బ తినడంతో డ్రైవలప్ మేడపాలి కొండలరావు (41)తో పాటు ప్రయాణికురాలు, ఏపీలోని ప్రకాశం జిల్లా పరుచూరివారిపాలెంకు చెందిన మహిళ దెందబోయిన గోవిందమ్మ (47) అక్కడికక్కడే చనిపోయారు. బస్సులో ఉన్న మరో 18 మందికి గాయాలు అయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో హైవేపైన సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బస్సును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.